తెలుగు యూనివర్సిటీ, మే 10: ‘బీసీలకు ద్రోహం చేసిన ప్రధాని మోదీని చరిత్ర క్షమించదు. బీసీల అభ్యున్నతికి శాపంగా మారుతున్న మోదీతోపాటు బీజేపీకి రాజకీయ పతనం తప్పదు’ అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసుదనాచారి స్పష్టంచేశారు. జనగణనలో సమగ్ర కులగణన చేపడుతామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇప్పుడు విస్మరించారని విమర్శించారు. దానిని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్లో పర్యటిస్తున్న ప్రధానికి గన్పార్కు అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో నల్లజెండాలు, బెలూన్లు చేబూని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీని భవిష్యత్తులో బంగాళాఖాతంలో కలుపడం ఖాయమని చెప్పారు.
జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉన్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన సాగిస్తున్నదని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. బీసీ ప్రధానిగా మోదీ ఉన్నందుకు బీసీలు సిగ్గుపడుతున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.
బీసీలకు బీజేపీ పంగనామాలు:జాజుల
బీసీ సమాజం ప్రధాని మోదీకి 10 ప్రశ్నలు సంధిస్తే 24గంటలు గడిచినా ఎలాంటి సమాధానం రాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బీసీ ప్రధాని అని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకొంటూనే అదే బీసీలకు పంగనామాలు పెడుతున్నారని మండిపడ్డారు. కులగణన చేపడుతామని 140 కోట్ల మంది సాక్షిగా ఢిల్లీలో ప్రకటించిన మోదీ.. ఇప్పుడు జరుగుతున్న కులగణన చేపట్టకుండా బీసీలను మోసం చేశారని, అందుకే ప్రధాని పర్యటన సందర్భంగా నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టామని పేర్కొన్నారు. బీసీలను మోసగిస్తే భవిష్యత్తులో ప్రధాని పర్యటనను పూర్తిస్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు.
శాంతియుతంగా నిరసన చేపట్టడానికి తరలుతున్న బీసీ సంఘాల నాయకులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్బాస్, బీసీ సాధన కమిటీ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కే వెంకటేశ్, టీ విక్రమ్గౌడ్, ధనలక్ష్మి, ఉప్పరి శేఖర్ సగర, పీ ఆశన్న, మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.