హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట్టారు. రైతుబంధు, రుణమాఫీని ఎగ్గొట్టి రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితి దాపురించిందని విమర్శించారు.
రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న మంత్రి తుమ్మల.. రేవంత్రెడ్డితో దోస్తీ చేసి మొద్దుబారిపోయారని చురకలంటించారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి కేసీఆర్పై ఎగిరెగిరిపడ్డ ఆకునూరి మురళి ఇప్పుడు తోకముడిచి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక హత్యారాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేతను హతమార్చిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం అండతో ఎనుముల బ్రదర్స్ రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ జిల్లాకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. ఈ జిల్లాకు సీఎం, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి శూన్యమని దెప్పిపొడిచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటనల తర్వాతే సర్కార్లో కదలిక వచ్చిందని గుర్తుచేశారు. ఇక నైనా హామీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.