Koppula Eshwar | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. గురువారం వెల్గటూర్ మండలం శాఖాపూర్, గొల్లపల్లి మండలం చిల్వకొడూర్తోపాటు పెద్దపల్లిలోని చందపల్లిలో ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను చిన్నచూపు చూస్తున్నదని అన్నారు. రంజాన్ వేళ కనీసం తోఫాలు కూడా ఇవ్వరా అని మండిపడ్డారు. అన్ని మతాలను సమానంగా చూసి, ముస్లింలకు పెద్దపీట వేసి.. అండగా నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకు సాగారని.. ఇప్పుడా సెటప్ అంతా చెదిరిపోయిందని కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు నీరు ఇవ్వకుండా, రైతు బంధు, రుణమాఫీ, పంటకు 500 బోనస్ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో టేలెండ్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందించామని, ఎక్కడా కూడా ఒక్క ఎకరం ఎండిపోయిన దాఖలాలు లేవని అన్నారు. సంవత్సరానికి కోటి 20లక్షల ఎకరాల్లో పంటలు పండించుకున్నామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో సాగునీరందక యాసంగిలో 20లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కన్నీరు పెడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.