KTR | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎకువ దృష్టి సారించిందని విమర్శించారు.
రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలకూ ఓ పరిమితి ఉంటుందని, ఆ పరిమితులను దాటి కాంగ్రెస్ పార్టీ sకేసీఆర్పై దుష్ప్రచారాలకు పూనుకున్నదని మండిపడ్డారు. అలాంటి ప్రయత్నాలు ఎకువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజా క్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ చేసే దుష్ప్రచారాలకు దేవుడు కూడా తగిన బుద్ధి చెప్తాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుంతంత్రాలు చేసినప్పటికీ చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.