హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రాతిపదికన జరుగనున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకొనేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెప్తున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈ రోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.
ప్రగతిశీల విధానాలతో ముందుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన పునర్విభజన వల్ల తకువ లోక్సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరం అని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల విధానాలను అనుసరించి జనాభా ను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.