హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ జరుగుతున్నపుడే ఈడీ అధికారులు తనను అరెస్టు చేసినందున ఇక ఆ రిట్పిటిషన్పై విచారణ అవసరంలేదని, అందుకే పిటిషన్ను వెనక్కు తీసుకుంటున్నట్టు కవిత తరఫు న్యాయవాది విక్రం చౌదరి తెలిపారు. ఇందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది.
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. కస్టడీలో ఉన్నవారికి ప్రతి 24 గం టలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 15న ఈడీ ఆమెను అరెస్టు చేసిన విష యం తెలిసిందే. శనివారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేముందు.. ఆ త ర్వాత కూడా వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు ఆమె తల్లి శోభమ్మ, పిల్లలు ఆదిత్య, ఆర్యలకు న్యాయస్థానం అనుమతించింది. కవితను కలిసేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని శోభమ్మ తరఫు న్యాయవాది మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శోభమ్మ, కవిత ఇద్దరు పిల్లలు కూడా కవితతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. వీరితోపాటు వ్యక్తిగత సహాయకుడు శరత్కు కూడా అనుమతి లభించింది. ఇప్పటికే కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు కవితతో ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడుగంటల మధ్య భేటీ అయ్యేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.