Harish Rao | గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని విమర్శించారు.
ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా అని నిలదీశారు. కేసీఆర్ గురుతులు చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరమని విమర్శించారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని అన్నారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, మీ మానిటరింగ్ ఏమైంది? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు.
ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా? అని హరీశ్ రావు మండిపడ్డారు. 20నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్ లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తున నిలబెడితే.. రేవంత్ రెడ్డి అధఃపాతాళానికి దిగజార్చాడని విమర్శించారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.