Harish Rao | నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే తనికెళ్ళ భరణి చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ జాప్యం చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనమని అన్నారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతున్నది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు.
కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్.. హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులకు రూపకల్పన చేశారని హరీశ్రావు గుర్తుచేశారు. ఏప్రిల్ 26, 2022 నాడు దేశ చరిత్రలోనే ఒకే రోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు శరవేగంగా జరిగిన ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ రాగానే నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రులు పూర్తయితే కేసీఆర్ ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్దితో రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయడం లేదని అన్నారు.కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నది రేవంతు ప్రభుత్వమని మండిపడ్డారు.
మొన్న అక్టోబర్ 3నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి సందర్శించి, ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీశామని హరీశ్రావు గుర్తుచేశారు. హడావుడిగా సమీక్షలు నిర్వహించి, ఆసుపత్రి ప్రారంభ తేదీలు ప్రకటించిన మంత్రులు ప్రజల తరుపున ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం టిమ్స్ ఆసుపత్రి సందర్శించి నెలన్నర రోజులు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. పనులు త్వరితగతిన చేపడుతామని సాక్షాత్తూ మంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయిందని అన్నారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద నోరుపారేసుకోవడం మానేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. పేదలకు సైతం అత్యున్నతమైన వైద్యం అందాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.