Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమని అన్నారు.
ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమని విమర్శించారు. జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా ఉండటం లేదని అన్నారు. వారి గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విషజ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో, ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నదని అన్నారు..
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఆసుపత్రి సిబ్బందికి శాపంగా మారిందని హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.