Harish Rao | ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు.
వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నదని హరీశ్రావు తెలిపారు. ఈరోజు నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుకునేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలని నిలదీశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.