Harish Rao | తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని హరీశ్రావు విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప.. ఎలాంటి కార్యచరణకు దిక్కులేదని అన్నారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని పేర్కొన్నారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నదని హరీశ్రావు అన్నారు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్న బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరని నిలదీశారు. సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణం ఎవరని అడిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గురుకులాలలో గత 11 నెలల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కూలిపోతున్నారని.. ఈ మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు.
ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ లోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరమని హరీశ్రావు మండిపడ్డారు. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిన గురుకులాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని అన్నారు. విద్యా శాఖతో పాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖలు నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.
స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా శాఖల పనితీరు గురించి చెప్పాల్సిన పనిలేదని హరీశ్రావు అన్నారు. ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి ముఖ్యమంత్రి గారూ అని నిలదీశారు. ఇంకెప్పుడు మీ కార్యచరణ మొదలుపెట్టి విద్యార్థులను కాపాడుతారని ప్రశ్నించారు. ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Gurukula Students1
Gurukula Students2