Harish Rao | యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని హరీశ్రావు అన్నారు. మొన్న రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నేడు అధికారిక కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ను అకారణంగా దుర్భాషలాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు.
దుర్భాషలాడింది చాలదన్నట్టు.. పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపిన తీరును ఖండిస్తున్నా అని హరీశ్రావు అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా.. జడ్పీచైర్మన్కు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డిని హరీశ్రావు డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరు(Guduru) గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఇదే సభలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం సరికాదని సందీప్ రెడ్డి తెలిపారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాధవరెడ్డి ఒక మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అన్నారు. కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించారు. సందీప్ రెడ్డిని తోసి వేసి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అతడిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.