Harish Rao : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీచేయడమనేది రేవంత్ర్డెడి చిల్లర రాజకీయాలకు పరాకాష్ఠ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ అని హెచ్చరించారు. ఈ మేరకు హరీష్రావు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
తెలంగాణ జాతిపిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు, గౌరవనీయులు కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్రావు తన పోస్టులో పేర్కొన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలంపాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం అంటే సూర్యునిపై ఉమ్మి వేసే ప్రయత్నమేనని మండిపడ్డారు.
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు, సిట్ పేరుతో నోటీసులు జారీచేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని హరీష్రావు విమర్శించారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
చరిత్రను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని హరీష్రావు మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.