Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కేవలం 11 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ను హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ‘మనఊరు- మనబడి’ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని హరీశ్రావు కోరారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతున్నదని తెలిపారు. తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించిందని గుర్తు చేశారు.