Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకులలో పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్తో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తించుకుంటున్నామని అన్నారు. మన ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయని తెలిపారు. కృష్ణ స్వామి విగ్రహాలను హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన చరిత్ర చాలా గొప్పదని.. బలహీన వర్గాల కోసం ఆయన గ్రంథాల్ని రచించారని.. ఆయన ఆనాటి నిజాం కాలంలోనే గుర్తింపబడ్డారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ1956 తర్వాత మొదటి మేయర్ కృష్ణ స్వామి అని హరీశ్రావు తెలిపారు. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు. పండగ సాయన్న భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని తెలిపారు. పెద్దొన్ని కొట్టు పేదలకు పెట్టాలనే నినాదంతో ఆయన పని చేశాడని పేర్కొన్నారు. ఆ కాలంలో పండగ సాయన్న అంటేనే హడల్ అని అన్నారు. పండగ సాయన్న సమాజ శ్రేయస్సు కోసం పనిచేశాడని చెప్పారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించి నిధులు విడుదల చేశారని హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వల్ల మన ముదిరాజ్ అధిక సంఖ్యలో ఉన్నారని తెలిసిందని అన్నారు. కేసీఆర్ హయాంలోనే మత్సకారులకు వాహనాలు పంపిణీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.