ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం గొంగిడి సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
దేశాన్ని దోచుకున్నోళ్లకు చేయూతనిచ్చిందే మోదీ అని గొంగిడి సునీత అన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం మోదీకి అలవాటు అని విమర్శించారు. వందల ప్రాణాలను బలి తీసుకున్న మోదీకి కవితను జైలుకు పంపించడం చిన్న విషయమని అన్నారు. వ్యతిరేకించిన వారిని ఇబ్బంది పెట్టడమే మోదీ నైజమని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారు పవిత్రులైపోతున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలను కబలించే కుట్ర జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ వచ్చే ముందు ఈడీ, సీబీఐ వస్తాయని విమర్శించారు. మోదీ పాలన దేశం భ్రష్టు పట్టిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కవితపై పెట్టిన కేసు మోదీ కేసు అని గొంగిడి సునీత విమర్శించారు. మహిళలను ఉద్యమం వైపు మళ్లించింది కవితే అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవితది ప్రత్యేక స్థానమని స్పష్టం చేశారు.