హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అసంబద్ద, అపరిపక్వ, అసమర్థ వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పరువును తీయొద్దని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ సూచించారు. దావోస్ సదస్సు సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల మధ్య బంధాన్ని ‘న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్’గా పోల్చడం, హైటెక్సిటీకి నేదురుమల్లి జనార్దన్రెడ్డి 1993లోనే శంకుస్థాపన చేశారని చెప్పేందుకు ‘నేదురుమల్ల జనార్దన్రెడ్డి స్టోన్ ఫౌండేషన్ స్టోన్ లెయిడ్ బై హైటెక్సిటీ’ అంటూ తడబడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దాసోజు శ్రవణ్ మంగళవారం స్పందించారు. సీఎం రేవంత్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలతో తాను నవ్వులపాలు అవడమే కాకుండా, ప్రపంచ వేదికపై తెలంగాణకు అపకీర్తి తెస్తున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి తన వాక్చాతుర్యాన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు వినియోగించాలని సూచించారు. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడు, ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో, ఏమేం మాట్లాడకూడదో సీఎం బృందంలోని జయేశ్రంజన్, విష్ణువర్ధన్రెడ్డి వంటివారు సలహాలు ఇవ్వాలని సూచించారు. రేవంత్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, అలాంటప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పాత్ర ఏమిటని ప్రశ్నించారు. సమర్థుడైన శ్రీధర్బాబును వెలుగులోకి రానీయడం లేదని విమర్శించారు. సీఎం చర్యలతో రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.