CM KCR | హైదరాబాద్ : తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ చెప్పారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో ‘రైతుబంధు భరోసా పత్రం’ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయిన రేవంత్రెడ్డి తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొడుతూ రైతుబంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారాయని చెప్పారు. వ్యవసాయం దండగా అనే నానుడి నుంచి.. వ్యవసాయం పండుగ అనే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని, అందుకు రైతుకు ఇచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు చాలా ఊతం ఇచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే పేద రైతులకు కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలో రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, చెరువుల పునరుద్ధరణ, ఎరువుల పంపిణీ, కల్తీ ఎరువుల బాధ నుంచి విముక్తి కల్పిస్తూ.. గిట్టుబాధర వంటి ఎన్నోపథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
కేసీఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తారని, కల్తీలు లేని వ్యవసాయాన్ని మన రైతులు త్వరలోనే చూడబోతున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులంతా ఈ విషయంపై ఆలోచించి కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతుల అభ్యుదయవాది సీఎం కేసీఆర్ అని చెప్పారు. పేద రైతుల జీవితాలు బాగుపడుతుంటే.. రేటెంతరెడ్డి ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెప్పించి రైతుబంధును ఆపి, పేద రైతుల నోటికాడ ముద్దను లాక్కున్నారని చెప్పారు. ఈ విషయమై తెలంగాణ రైతాంగం ఆలోచించాలన్నారు. రైతుబంధుకు పూర్తిగా ఎసరు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు శ్రవణ్ చెప్పారు. కేసీఆర్ది రైతుది పేగుబంధం అన్నారు. ఓట్ల కోణంలో రైతుబంధును ఆపించిన కాంగ్రెస్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. రైతుల్లో నెలకొన్న అభద్రతను తొలగించేందుకు, రైతుల్లో భరోసా కల్పించేందుకు ‘రైతుబంధు భరోసా పత్రం’తో సీఎం కేసీఆర్ అన్నదాతలకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ పత్రంపై ఆయనే సంతకం పెట్టి రైతుల్లో ధైర్యం నింపారని శ్రవణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ పాల్గొన్నారు.