Dasoju Sravan | తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నోరు చీరుస్తారంటూ శ్రవణ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ రేవంత్ బంధాన్ని కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాన ఎక్కించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కూడా చూడకుండా.. ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీ లీడర్ కన్నా అధ్వాన్నంగా రేవంత్ రెడ్డి తీరు ఉందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ అయినా రేవంత్ తీరు మార్చాలని సూచించారు.
అద్దం ముందు కూర్చొని రేవంత్ రెడ్డి ఓసారి మొహం చూసుకోవాలని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్సోళ్లకు కోపం వస్తే ఐదేండ్లలోపే సీఎంగా దిగిపోతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు ఘోరీ ఎందుకు కడతావ్.. తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అన్నివిధాల అభివృద్ధి చేసినందుకా? అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్పై ఇలాగే అసభ్య భాష కొనసాగితే రేవంత్ రెడ్డి నాలుక చీరేది తెలంగాణ ప్రజలేనని స్పష్టం చేశారు. హామీల అమలును ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి అసహనం పొడుచుకొస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ కన్నా మంచి పాలన అందించడంలో రేవంత్ పోటీ పడాలని సూచించారు.
మోదీని రేవంత్ రెడ్డి కలిశాక కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడుతున్నాయని దాసోజు శ్రవణ్ అన్నారు. వీటిని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు. మోదీ – రేవంత్ రెడ్డి బంధమేంటో బయటపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక, రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం, అదానీతో ఒప్పందం, తెలంగాణకు ఐపీఎస్ల కేటాయింపు ఇలా అన్ని అంశాలు రేవంత్ – మోదీ బంధాన్ని రుజువు చేస్తున్నాయని వివరించారు. రేవంత్కు చేతనైతే కృష్ణా రివర్ బోర్డు విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కృషి చేయాలని సూచించారు.