Dasoju Sravan | లగచర్ల రైతు హీర్యా నాయక్కు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన బాధితులపై ఇంత కోపమెందుకు ముఖ్యమంత్రి గారు అని ఆయన మండిపడ్డారు. మీ వైఖరి పాశవికతకు పరాకాష్ట అని విమర్శించారు.
దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేసింది చాలక, తప్పుడు కేసులు పెట్టి, ఆఖరికి జైళ్లలో వారికి గుండె సంబంధిత ఇబ్బంది ఉంటే రాజ్యాంగ వ్యతిరేకంగా సంకెళ్లు వేసి హింసించడం న్యాయమా అని సీఎం రేవంత్ రెడ్డిని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. వారికి జైళ్లలో కనీస వైద్యం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా ఎన్నిరోజులు వారికీ బెయిల్ రాకుండా అడ్డుకుంటారు? అని నిలదీశారు. మా భూములు మాకే అన్న పాపానికి వారిని చంపుతారా అని మండిపడ్డారు. హీర్యా నాయక్ కుటుంబ సభ్యులను చూడనివ్వరా? పరామర్శ కూడా చేయనివ్వరా అని అడిగారు. న్యాయం కోరిన వికారాబాద్ సీనియర్ న్యాయవాది రాంచందర్పై దురుసుగా ప్రవర్తించడం కూడా హక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేశారు.
గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న హీర్యా నాయక్కు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అని.. ప్రభుత్వం ఆధిపత్య అహంకారంతో చేస్తున్న నేరం అని విమర్శించారు. ఇదేమి ప్రజా పాలన? ఇదేమి పోలీస్ రాజ్యం అని మండిపడ్డారు.