Dasoju Sravan | రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోతే.. ఎక్కడ చనిపోయారు? వాళ్ల పేర్లు, అడ్రస్లు ఇవ్వమని ఎకసెక్కలు చేస్తావా? అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అన్ని మేమిస్తే నువ్వేం పీకుతావ్ అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల అడ్రస్లు కేసీఆర్ ఇస్తే.. నువ్వు వెళ్లి ఆదుకుంటావా? అని దాసోజు శ్రవణ్ అన్నారు. అంతదానికి నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్లు ఎందుకు? నీ డాబు ఎందుకు? అని మండిపడ్డారు. కేసీఆర్ నానా కష్టాలు పడి వ్యవసాయాన్ని స్థీరికరణ చేశారని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రతి సాగు భూమికి నీళ్లు అందించే ప్రయత్నం చేశారని.. ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా అందించి.. వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. కానీ మీ దుర్మార్గమైన, కుట్రపూరితమైన పాలనతో ఇప్పుడు రైతులు పంటలను తగులబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాటు రైతాంగం పంటలు పండించి పండుగ చేసుకుంటే.. ఇవాళ ఎందుకు పొలాలను తగులబెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ట్యాంకర్లతో నీళ్లు ఎందుకు తెచ్చుకుని పంటలను తడుకుంటున్నారు అని అడిగారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగితే ఎకసెకలు చేస్తావా? అని మండిపడ్డారు.