భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిడబ్ల్యూసి సభ్యులకు డా శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ
తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించడం, తద్వారా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం.
గతంలో ఉగ్రవాదులకు అడ్డాగా, ముఖ్యమంత్రులమార్పిడి కోసం జరిగిన కుట్రలతో రాజకీయ ప్రేరేపిత మతకల్లోలాలకు వేదిక అయిన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇవాళ మీ పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి వేదికగా గుర్తించబడ్డది అంటే, దానికి ఏకైక కారణం తెలంగాణ ఉద్యమ సారధి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి దార్శనికత, గత పది ఏళ్ళ నుండి అయన నాయకత్వంలో శాంతిభద్రతలను కాపాడుతూ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ కొనసాగుతున్న పటిష్టమైన పరిపాలన అన్న విషయాన్నీ గుర్తించాలి.
ఐతే హైదరాబాద్ కు వస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు నిష్పక్షపాతంగా స్వచ్ఛమైన మనసుతో తెలంగాణ అభివృద్ధి నమూనాను లోతుగా అధ్యయనం చేయాలనీ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకొని మీరు పాలించే రాష్ట్రాలలో, మరియు మీరు ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ అభివృది నమూనాను అమలు చేయించేందుకు మీరు కృషి చేయాలనీ కోరుతున్నాను.
మీరు సంకుచిత మనస్తత్వంతో ఒక పొలిటికల్ టూరిస్ట్ గా కాకుండా, విశాల దృక్పథం కలిగిన సానుకూల ఆలోచనలతో తెలంగాణ అభివృద్ధి పై అధ్యయనం చేయడానికి వస్తున్న ఒక పరిశోధకుడిగా, పర్యటనను ఒక స్టడీ టూర్ గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
మీ పర్యటనలో భాగంగా ముందుగా మీరు హైదరాబాద్ లో అడుగుపెట్టినపుడు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్త ఫోక్స్ కాన్ చైర్మన్ మరియు ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ మెచ్చుకున్న అద్భుతమైన విశ్వనగరం మీకు దర్శనమిస్తుంది. ఒకప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ ను డల్లాస్ లేదా న్యూయార్క్ మాదిరిగా తీర్చిదిత్తుతాను అంటే కొంత మంది అతియోశక్తిగా నవ్వినా, తాను ఏమాత్రం పట్టించుకోకుండా సంకల్పసిద్ధితో దాదాపు పది ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనలో మౌళిక సదుపాయాలు, సామాజిక భద్రత, నిర్మాణాత్మకంగా.. నగరం ఎంత అద్భుతమైన అభివృద్ధి సాధించిందో అధ్యయనం చేయండి.
హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా జీహెచ్ఎంసీ ద్వారా వేలకోట్ల రూపాయల ఖర్చుతో ఎన్ని నిర్మాణాలు చేపట్టిందో కళ్లారా చూడండి. టి హబ్, టి వర్క్స్ లాంటి వినూత్న ప్రయోగాలతో, ఫార్మా సిటీ, ఐటీ కారిడార్లతో, ఆకాశహర్మ్యాలతో, విశాలమైన రోడ్లతో, డ్రైనేజీ వ్యవస్థతో హైదరాబాద్ విశ్వనగరంగా ఎట్లా రూపాంతరం చెందిందో నేర్చుకోవాలని కోరుతున్నాను.
మీరు అలాగే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ బెడద నివారించేందుకు అనేక కిలోమీటర్ల మెయిన్ రోడ్లను, లింక్ రోడ్లను, వాటి వెంట అనేక ఫ్లయ్ఓవర్లు, అండర్పాస్లు, కారిడార్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చెక్ పెట్టిందో పరిశీలించండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకు, పరిశ్రమలకు, సంస్థలకు సకల సదుపాయాలు, వసతులు కలిపిస్తూ శాంతి భద్రత లతో కూడుకున్న సామాజిక భద్రత అందిస్తూ, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంప్రదాయాలు, విభిన్న జీవనశైలులకు నిలయమై, హైదరాబాద్ కున్న గంగా జమునా తెహజీబ్ అనే ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కాపాడుతూ హైదరాబాద్ ని విశ్వనగరంగా కెసిఆర్ మార్చిన తీరుని అధ్యయనం చేయండి.
మంత్రి శ్రీ కెటీఆర్ సారధ్యంలో ఐటీ రంగం నిర్విరామ కృషితో విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ అందనంత వేగంగా దూసుకుపోతున్న తీరు పరిశీలించండి. ఆపిల్ , గూగుల్, అమెజాన్ మైక్రోసాఫ్ట్, పేస్ బుక్, సేల్స్ ఫోర్స్, ఉబర్, స్టేట్ స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ సింగపూర్, ఫియట్ క్రిస్లర్, ఇంటెల్, మాస్ మ్యూచువల్, గోల్డ్మన్ సాష్ ఇంకా చాల పెద్ద గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ వేదికగా మారిందంటే, అది కేవలం కెసిఆర్ కృషిమాత్రమే అన్న విషయాన్నీ గుర్తించాలి. కేవలం రూ 57,258 కోట్లు వున్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ 2,41,275 కోట్ల కు ఎలా పెరిగాయి? తొమ్మిదేండ్లలో ఐటీ రంగంలో 9.10 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పించారో తెలుసుకోండి.
టైర్ – 2, టైర్ -3 నగరాల్లోనూ ఐటీ రంగాన్ని విస్తరించి స్థానికంగానే ఉపాధి అవకాశాలనుకలిపిస్తున్న ప్రణాళికలను అధ్యయనం చేయండి. ఐటీతో పాటు, ఫార్మా, హెల్త్ కేర్ , టూరిజం, ఆతిథ్యం, విద్య తదితర రంగాలకు హైదరాబాద్ బిగ్గెస్ట్ హబ్గా ఎలా మారిందో ప్రత్యేక్షంగా చూడండి. కేవలం హైదరాబాద్ నగరం మాత్రమే కాదు, పట్టణ ప్రగతి పధకం ద్వారా హైదరాబాద్ చుట్టూ వున్న ప్రతి జిల్లా కేంద్ర పట్టణాలలో జరిగిన అభివృద్ధి చూడండి. ఈ అభివృద్ధికి నిదర్సనంగా తెలంగాణలోని 16 అర్బన్ లోకల్ బాడీస్ కి గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులతో గుర్తించిన సంగతి తెలుసుకోండి.
అలాగే మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తెలంగాణ కొత్త సచివాలయానికి `డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేట్ సెక్రటేరియట్`గా నామకరణం చేశారు సీఎం కేసీఆర్. వర్తమానంలో మరియు భవిష్యత్లో కూడా తెలంగాణ పాలకులు బాబా సాహెబ్ను నిరంతర స్ఫూర్తిగా తీసుకోవాలనే గొప్ప సంకల్పంతో సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇలా బాబాసాహెబ్ పేరును తమ సచివాలయాలకు పెట్టలేదనే చారిత్రాత్మక వాస్తవం మీరు తెలుసుకోవాలి.
అలాగే రాజ్యాంగ నిర్మాత మహా నాయకుడు బాబాసాహెబ్ సేవలని స్మరిస్తూ, వారి పట్ల కృతజ్ఞతతో, సెక్రటేరియట్ పక్కనే 125 అడుగుల బాబాసాహెబ్ అతి పెద్ద విగ్రహాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. మీ పర్యటనలో బాబాసాహెబ్ విగ్రహం వద్ద వారికీ నివాళులు అర్పించి సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఎంత గొప్పగా సమానత్వం, సామజిక న్యాయం విరాజిల్లుతుందో ఆత్మ సాక్షిగా అర్ధం చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యు పి ఏ ప్రభుత్వం, అకారణ ఆలస్యం చేయడంతో, అనేకమంది విద్యార్థి నిరుద్యోగులు అమరులైనారు. వారికీ కృతజ్ఞతతో వారి స్మృత్యర్థం కెసిఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయీ అమరవీరుల స్మారక కేంద్రాన్ని సందర్శించాలని కోరుతున్నాను.
లండన్కు చెందిన స్వతంత్ర స్వచ్ఛంద సంస్థ ‘ది గ్రీన్ ఆర్గనైజేషన్’ నుంచి ‘ఇంటర్ నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్’ గా గుర్తించబడిన యాదాద్రి ఆలయం, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇంటిగ్రేటెడ్ పొలిసు కమాండ్ కంట్రోల్ సెంటర్, మోజం జాహీ మార్కెట్ లకు ఐదు ‘గ్రీన్ యాపిల్ అవార్డులను’ గెలుచుకున్న విషయం తెలుసుకోండి. మీ పర్యటనలో తప్పకుండా కెసిఆర్ గొప్పగా పునర్నిర్మించిన యాదాద్రి దివ్య క్షేత్రాన్ని దర్శించి, శ్రీ లక్ష్మి నరసింహస్వామీ ఆశీస్సులు తీసుకోండి. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దిన తీరు ప్రత్యేక్షంగా చూడండి.
పనిలో పని అన్నట్లు, మీరు మీ అబద్దాల నాయకుడు రేవంత్ రెడ్డి ప్రేరేపణకు లోనై రాజకీయాలకోసం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పల్లెలకు, పట్టణాలకు పోతున్నట్లు సమాచారముంది. అయితే, మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు తెల్లవారు లేవగానే గ్రామంలో ఉన్న ప్రతి చెరువు దగ్గరకు వెళ్ళండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించినప్పటికీ, మిషన్ కాకతీయలో భాగంగా ఆ చెరువును బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. తద్వారా ఎండిన చెరువులు, నిండు నీటి కుండలవలె ఎట్లా మారినవో చూడండి, ప్రతి నీళ్లున్న చెరువులో చేప పిల్లలు ఎట్లా దునుకుతున్నాయో చూడండి. మిషన్ కాకతీయ పథకంతో ఇప్పటి వరకూ నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను ఎలా పునరుద్ధరించారనేది స్వయంగా చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడి జరిగిన పనులని పరిశీలించి ఒక రోల్ మోడల్ గా అధ్యయనం చేయండి.
తరువాత పక్కనే ఉన్న ప్రకృతి వనాలకు వెళ్ళండి గ్రామంలో ఎంత అద్భుతంగా పార్కుల నిర్మాణం జరిగిందో చూడండి. తెలంగాణ పల్లెలు పట్టుగొమ్మలుగా మారిన తీరు గమనించండి. హరితహారంలో భాగంగా నాటిని 273 కోట్ల మొక్కలతో ఎటు చూసినా మీకు పచ్చని ప్రకృతిదర్శనమిస్తుంది. ఈ కార్యక్రమం వలన గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ప్రజలు చెప్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం గురించి గ్రామస్తులని అడిగి తెలుసుకోండి.
మీ పర్యటనలో తెలంగాణ ‘మిషన్ భగీరథ` ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. దేశానికే ఆదర్శంగా నిలిచిన `మిషన్ భగీరథ` పథకం ద్వారా రాష్ట్రం లోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికి ఈ పథకం ద్వారా పైపు లైనుల ఏర్పాటుతో తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీర్చటంతో పాటు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటితో నల్గొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని కెసిఆర్ ప్రభుత్వం ఎలా నిర్మూలించిందో స్థానిక ప్రజలని అడిగి తెలుసుకోండి. ఇదే సందర్భంలో ప్రతి ఇంటికీ నల్లా సమకూర్చి, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అని పార్లమెంటు సాక్షిగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం గుర్తు చేసుకోండి. మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అనేక అవార్డులు ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్థం చేసుకోండి. దీని ప్రేరణ తోనే కేంద్రప్రభుత్వం `హర్ ఘర్ జల్` అనే పథకాన్ని ప్రారంభించిదని తెలుసుకోండి.
భగీరథ ప్రయత్నంతో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు జలకళ ఎలా తెచ్చిందో కూడా తెలుసుకోండి. దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3-4 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించండి. ఈ మహత్తర ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోని 13 జిల్లాలకు ఎంత లబ్ధి చేకూరిందో.. బీడువారిన భూముల దగ్గరకు గోదావరి నదిని మళ్ళించిన అపర భగీరధుడు కేసీఆర్ గారి పాలన దక్షత ఎంత గొప్పదో తెలుసుకోండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించి- 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి. ఒకప్పుడు నీళ్లులేక నెర్రెలు బారిన తెలంగాణ, ఈ పర్యటనలో మీకు ఎటుచూసినా పచ్చని పొలాలు కనిపిస్తాయి.
రైతుబంధు, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం, పాలమూరు రంగా రెడ్డి , మిషన్ కాకతీయ ఇంకా అనేక ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి పుష్కలమైన సాగునీటినీ ఎంత అద్భుతంగా అందిస్తుందో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి లభిస్తున్న అండదండల్ని దేశంలో మరే రాష్ట్రమూ అందించడంలేదని తెలుసుకోండి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లడం కనిపిస్తుంది. ఈ తొమ్మిదేళ్ళలో కేసీఆర్ ఈ సువర్ణాధ్యాయనాన్ని ఎలా సాధించారో లోతుగా ఆలోచన చేయండి.
2014-15లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు ఉండగా, 2022-23లో నాటికి 2.70 కోట్ల టన్నులకు ఎలా చేరుకున్నది? కోటి 31 లక్షల ఎకరాలు వున్న సాగు విస్తీర్ణం, నేడు 2 కోట్ల 20 లక్షల ఎగరాలకు ఎలా పెరిగింది? ఇంత ప్రగతి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా సాధించిందనే విషయాలపై లోతుగా పరిశీలన చేయండి. సాగునీటి సమస్యని తీర్చి తీరు, రైతుబంధు పథకం కింద ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్న విధానం, ఈ పథకం కింద ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం అక్షరాలా రూ.65 లక్షల కోట్లని మీకు లబ్దిదారులే చెబుతారు. ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్, ఇదిగాక రైతు భీమా, పంటలబీమా, వివిధరకాల సబ్సిడీలు, నకిలీ విత్తనాలు అరికట్టడానికి పిడి యాక్ట్ లాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవటం, ప్రభుత్వమే పంటవిత్తనాలను సరఫరా చేయటం, వ్యవసాయ యాంత్రీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలస్థాపన, గోడౌన్ల నిర్మాణం వంటి అనేకానేక చర్యలు తీసుకుని కేసీఆర్ అన్నదాతను కంటికి రెప్పలా ఎలా కాపాడుతున్నారో రైతన్ననే అడిగి తెలుసుకోండి.
రూ. 572.22 కోట్లతో అమలు చేసిన రైతు వేదిక పథకం ద్వారా రాష్ట్రంలో 2601 రైతువేదికలు ఏర్పాటయ్యాయి. అక్కడికి వెళ్లి కూర్చుంటే.. ప్రతి రైతుకూ కెసిఆర్ ప్రభుత్వం వల్ల వారికి ప్రయోజనం ఎలా చేకూరిందో అర్ధం చేసుకోండి. పంటరుణాల రద్దు పథకం కింద 16,144.10 కోట్లు ఖర్చుచేసి, 35,31,913 మంది రైతుల రుణాలను రద్దుచేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ఫలితంగా ప్రతి రైతు కుటుంబానికీ లక్ష రూపాయల దాకా లబ్ది ఎలా చేకూర్చిందో రైతులని అడిగి తెలుసుకోండి.
తెలంగాణ వస్తే రాష్ట్రం ఇక్కడంతా అంధకారమవుతుందని అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెత్తం పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని భయపెట్టారు. అసలు మాకు పాలనే రాదని ఎద్దేవా చేశారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ కేసీఆర్ గారి మార్గదర్శనంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలు గురించి తెలుసుకోండి. నేడు అన్ని రంగాలకు నిరంతరాయం గా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించిందనే వాస్తవం తెలుసుకోండి. విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచింది. జాతీయ తలసరి వినియోగం 1255 యూనిట్లు వుంటే తెలంగాణ వినియోగం 2126గా వుందని తెలుసుకోండి.
విద్యా వ్యవస్థలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్నమైన సంస్కరణలు గురించి ఊరూరా తిరుగుతూ తెలుసుకోండి. బిఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలని ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధన ని గమనించండి. ఏటా ఒక్కొక్క విద్యార్థిపైనా రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలుసుకోండి. రాష్ట్రంలోని 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35,952 మంది పిల్లలు చదువుతున్నారు. దశలవారీగా పాఠశాలల అభివృద్ధి నిమిత్తం రూ. 7,289 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. అన్ని విద్యాలయాల్లో, హాస్టళ్ళలో సన్నబియ్యంతో వండిన భోజనం; ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, వందశాతం మెస్ చార్జీల చెల్లింపుతో పటు కార్యక్రమాలతో విద్యా వ్యవస్థని ఎంతలా మెరుగుపెరిచిందో స్వయంగా వెళ్లి తెలుసుకోండి. మౌలిక సదుపాయాలను బలోపేతం చెయ్యడం, ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చెయ్యడం, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు, ఉచిత విద్య, వసతి, ఇతర సౌకర్యాలను నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అందించడం, అదే సమయంలో విద్యలో నాణ్యతను పెంచడానికి బోధనలో సరికొత్త పద్ధతులను అనుసరించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు, ఉపకారవేతనాలు, ఆర్థిక సహాయం, ఫీజ్ రీయంబర్స్మెంట్ తో పాటు, కొత్త జూనియర్ కళాశాలల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నిబద్దతతో చేపడుతుందో గ్రహించండి. అలాగే విద్యకు దూరమయానా మైనార్టీలకు గురుకులాలు వరంగా మారాయనే విషయం మీరు తెలుసుకోవాలి. కార్పొరేట్కు దీటుగా.. విశాలమైన భవనాలు, క్రీడామైదానం, డిజిటల్ తరగతుల ఇలా అన్నీ వసతులతో ఇక్కడ విద్యాబోధన జరుగుతోంది.
మన ఊరు- మనబడి’, ‘మన బస్తీ-మన బడి’ పధకంలో నిర్మించిన స్కూల్స్ ని సందర్శించండి. కార్పోరేట్ స్కూల్స్ ని తలదన్నే స్కూల్స్ కనిపిస్తాయి. దేశంలో ఎందుకు ఇలాంటి స్కూల్స్ నిర్మించలేకపోతున్నారో ఆత్మ విమర్శ చేసుకోండి . అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం SC/ST వర్గాలకు చెందిన పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిర్మించైనా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించాలి. ఈ పాఠశాలల్లో నేడు మొత్తం 2,80,897 మంది విద్యార్థులు చదువుతున్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1,50,000 ఖర్చు చేస్తుంది. ఈ అంశంలో ఏ కాంగ్రెస్ పాలిత కూడా తెలంగాణకు దగ్గరగా రాగలదనే వాస్తవం మీకు బోదపడుతుంది.
2014లో దాదాపు 365 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు ఉండగా.. 2023లో ఈ సంస్థల సంఖ్య 805కి చేరుకుంది. ప్రతి విద్యా సంవత్సరంలో దాదాపు 2.50 లక్షల మంది SC విద్యార్థుల “పోస్ట్ మెట్రిక్ విద్య”కు మద్దతుగా ప్రభుత్వం అందిస్తున్న రూ. 368.06 కోట్లు సహాయం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే మీ పర్యటనలో స్టడీ సర్కిల్లు కు సందర్శించాలి. 2014 వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒకే స్టడీ సర్కిల్ ఉండేది, ఇప్పుడు 11 ఎస్సీ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దళిత యువకులకు వృత్తి నైపుణ్యంలో ఇస్తున్నారు. ఈ పథకం కింద ట్రైనీలు TCS, Cognizant, Del, Cisco, Gen Pact, Deloitte, L&T , Apollo Care వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందినవారిని కూడా మీరు కలవాలి.
డా. బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా SC/ST విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల స్కాలర్షిప్ కూడా అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం నుండి లబ్ది పొందిన 7000 మందికి ఏ ఒక్కరిని అడిగినా మీకు మరిన్ని వివరాలు చెబుతారు. అలాగే 13,264 మంది ఔత్సాహిక SC/ST పారిశ్రామికవేత్తలకు T-ప్రైడ్ పథకం కింద పారిశ్రామికవేత్తలుగా ఎలా మారారో కూడా వివరిస్తారు. తప్పకుండా వారిని మీరు కలసి తీరాలి.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను ఎంతలా బలోపేతం చేసిందో తెలుసుకోండి. తెలంగాణ ఇప్పుడు ఆరోగ్య తెలంగాణగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరిగింది. బాలింత మరణాలు, శిశుమరణాలు చాలావరకూ తగ్గాయి. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మీ బాలామృత ప్లస్ ఇలాంటి అద్భుతమైన పథకాలతో పాటు 34 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆర్టిపిసిఆర్ లేబరేటరీలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యరంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి.
మీ పర్యటనలో నూతనంగా ఏర్పడిన పంచాయితీలని సందర్శించండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చాలని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్ గారి ప్రభుత్వం నెరవేర్చిందని తద్వారా ఆత్మ గౌరవంతో పాటు స్వయంపాలనతో జీవిస్తున్నామని గిరిజనులు, ఆదివాసులు ఎంతో అనందంగా మీకు వివరిస్తారు.
అన్నట్టు..మీ గ్రామాల పర్యటనలో గిరిజనకుటుంబాలని తప్పకుండా కలవాలి. తెలంగాణలోని 2,845 గిరిజన తండాల్లో విస్తరించి ఉన్న దాదాపు 150,224 ఆదివాసీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 4,01,405 ఎకరాల పోడు భూములను పంపిణీ చేసిందని అక్కడి ప్రజలు చెబుతారు. అంతేకాదు లబ్ధిదారులకు 24 గంటల ఉచిత కరెంట్ , రైతు బంధు, రైతు భీమా తదితర ప్రయోజనాలు కూడా అందుతున్నాని మీకు తెలియజేస్తారు. ఈ విషయంలో మీకు సందేశాలు వుంటే మీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీమతి సీతక్కని అడగండి. ఎందుకంటే సీతక్క గారి తల్లిదండ్రులు కూడా కేసీఆర్ పాలనలో పోడు భూములకు పట్టాలు పొందారని స్వయంగా చెప్తారు.
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. ఒకప్పుడు రూ.లక్ష రుణం కావాలంటే సవాలక్ష ప్రశ్న లు, ఆస్తులు తనఖా పెడితే గానీ, బ్యాం కుల్లో రూపాయి దొరకని పరిస్థితులు ఉండేవి. బ్యాంకుల చుట్టూ తిరగలేక తమ బతుకులేవో తాము బతుకుతున్న ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని లబ్దిదారులే చెబుతారు. ఒకప్పుడు ఇంకొకరిపై ఆధారపడి బతికిన తాము ఇప్పుడు ఇంకొకరికి ఉపాధి చూపే స్థాయికి చేరుకున్నామని కూడా చెబుతారు. సిగ్గుపడకుండా వినండి. ఇలాంటి పధకాన్ని మీరు అధికారంలో వున్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ఆలోచించుకోండి.
వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధైన వృత్తి చేనేత. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, నేతన్న బీమా, తెలంగాణ చేనేత మగ్గం పథకాల ద్వారా ఈ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న కర్ని, సాలే, దుదేకుల, రజక, మైనార్టీల జీవితాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినఅద్భుతమైన మార్పుని పరిశీలించండి. కేసీఆర్ గారి పాలనలో చేనేతకు పూర్వవైభవం వచ్చిందని కార్మికులే చెబుతారు.
దేశంలో ఎక్కడాలేని విధంగాగొల్ల, కురుమల సంక్షేమానికి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ద్వారా అనతికాలంలోనే సంపద అమాంతం పెరిగి తాము సీమంతులయ్యామని యాదవ సోదరులే చెప్తారు. అదే విధంగా ప్రతి చెరువుతో కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి, వారి ఆదాయానికి తోడ్పడ్డా విషయం తెలుసుకోండి.
అలాగే మీ పర్యటనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని సందర్శించండి. గతంలో కాంగ్రెస్ ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.60-90 వేలు మాత్రమే ఇచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం యూనిట్ రూ. 8 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని, భూమి ధరను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కరూ కోటీశ్వరులుగా మారామని స్వయంగా లబ్దిదారులే చెబుతారు. ఆత్మ గౌరవంతో వెలుగుతున్న వాళ్ళ కళ్ళలోకి చూసి ఇలాంటి పనులు మీరు ఎందుకు చేయలేకపోతున్నారో ఆలోచించండి.
టీఎస్ ఐపాస్ ద్వారా 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం, లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు T-ప్రైడ్ పథకం, దళితబంధు, ఇంకా అనేక స్వయం ఉపాధి పథకాలతో పేదింటి బిడ్డలకు ప్రోత్సాహం కల్పించివారిని వారిని వ్యాపారవేత్తలు మార్చిన తీరుని పరిశీలించండి స్వయం ఉపాధి లోన్స్, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఒక లక్ష రూపాయిలు, బీసీల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు ఒక లక్షరూపాయిలు, స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ ఇచ్చి ఎంత చక్కగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో తెలుసుకోండి.
నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, సంఘవిద్రోహ శక్తుల కట్టడి, ఇలా అన్నింటా తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నాయో పరిశీలించింది. షీ టీమ్ రూపంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళకు ఎంత పటిష్టమైన భద్రతను కల్పించిందో తెలుసుకోండి.
దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.50 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో, సంక్షేమ పథకాల ద్వార పేదలకు ఎంతటి ఆర్థిక భరోసా ఇచ్చిందో, ప్రజలు హుందాగా ఆత్మగౌరవంతో ఎంత హాయిగా బ్రతుకుతున్నారో ప్రజలని కలసి తెలుసుకోండి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆసరా ఫించన్ల ద్వారా నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు,(రూ.2016); వికలాంగులు (4,016) వితంతువులు,, బోదకాలు వ్యాధి బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు ( రూ. 2016)) , చేనేత కార్మికులు ( రూ. 2016) , బీడీ కార్మికులు ( RS 2016) , ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ( రూ. 2016) , వృద్ధ కళాకారులు ( రూ. 2016) , డయాలసిస్ పేషెంట్లు, తదితర ఆసరా పథకానికి అర్హులైన వారందరికీ పింఛన్లతో ఎంత గొప్ప భరోసా అందిస్తుందో లభ్దిదారులనే అడిగి తెలుసుకోండి. ఆసరా పెన్షన్స్ ద్వారా 44లక్షల మంది లబ్ది పొందుతున్నార్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కన్నా కొడుకుగా చూస్తున్న ప్రేమ వారి కళ్ళలో మీకు కనిపిస్తుంది.
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో బిఆర్ఎస్ అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ పథకాల తెచ్చిన కళ్యాణ కాంతులు చూడండి. ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116, అదే దివ్యాంగ అమ్మాయిల వివాహానికైతే రూ.1,25,016ల చొప్పున అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారిదని తెలుసుకోండి.
గతించినవారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకడానికి సరైనన్ని స్మశానాలు లేవని గుర్తించి, ప్రభుత్వం వూరూరా వైకుంఠధామాలను నిర్మించింది. వీటి నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ప్రభుత్వమే అందించింది. హైదరాబాద్ ఆధునీకరించిన ఏదైనా వైకుంఠధామాన్ని దర్శించండి. మీ రాష్ట్రలలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నారో పరిశీలించుకోండి.
దేశంలో ఎక్కడా లేని విధంగా అర్చకులకు, పాస్టర్లకు, మసీదులో వుండే మోజమ్ లకు గౌరవవేతనాలు అందిస్తున్నామని కూడా పర్యటనలో మీకు తెలుస్తుంది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. మీ పర్యటనలో తెలంగాణ తలసరి అదాయానికి సంబధించిన వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు ఏకంగా రూ.3,17,115కి ఎగబాకింది. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 156 శాతం (రూ.1,93,001) వృద్ధి చెందింది. . కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంత గొప్ప అభివృద్ధి సాధించిందో ఈ గణాంకాలు పరిశీలిస్తే మీకే అర్ధమైపోతుంది.
కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గాధ గురించి చెప్పలంటే ఇంకా చాల విషయాలు ఉన్నాయి, మీరు తెలంగాణ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా అనేకం ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి నమూనా 24 క్యారట్ల నిఖార్సైన బంగారు వన్నె కలిగినటువంటిది, అబద్దపు పునాదుల మీద నిర్మించి, తప్పుడు ప్రచారం చేసిన గుజరాత్ అభివృద్ధి మోడల్ వంటిది కాదు. ఈ పర్యటనలో మీరు బాగా నేర్చుకొని, మీ ప్రాంతాలలో మీ రాష్ట్రాలలో కెసిఆర్ అమలు చేసిన ఆదర్శవంతమైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాను.
తెలంగాణ అంటే ఇప్పుడు అభివృద్ధికి సంక్షేమానికి ఒక పర్యాటక ప్రాంతం. దేశానికి దిక్సూచి. 10 ఏళ్ల కింద తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఎలా పెరిగిందో, బీడు భూముల్లో కాలేశ్వరం జలాలు గలగల పారుతూ బంగారు పంటలు యెట్లా పండిస్తున్నాయో, తెలంగాణ వ్యాప్తంగా చెరువులు కుంటలు జలకలతో ఎలా నిండిపోయాయో, కాలువల్లో సాగుబడి జలాలు ఎలా పారుతున్నాయో.. ఒక్కసారి తిరిగి తెలుసుకోండి రైతుల పొలాల దగ్గరికి వెళ్లి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును కేసీఆర్ ప్రభుత్వం ఇలా అందిస్తుందో, పండించిన పంటలను కల్లాల వద్దకే వచ్చి ఎలా కొంటున్నారో, పండించిన పంటకు వచ్చే పైసలు బ్యాంకుల్లో ఎంత సక్రమంగా జమ చేస్తున్నారో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి లావాదేవీలు నిమిషాలు ఎలా పూర్తవుతున్నాయో, భూ బాంధవి ధరణి పోర్టల్ తో ఒక్కపైసా అవినీతికి తావులేకుండా.. ఆలస్యానికి ఆస్కారం లేకుండా వ్యవసాయ భూముల లావాదేవీలు ఎలా నిరాటంకంగా సాగిపోతున్నాయో… ఇంత చారిత్రాత్మక మార్పులు యుద్ధ ప్రాతిపదికన ఎలా జరిగాయో అన్ని అడిగి తెలుసుకోండి.
బాధిత కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అందించాలో, అభివృద్ధిని ఎలా చేసి చూపించాలో, రోడ్లు భవనాలు, విద్యుత్తు, విద్య, వైద్యం వ్యవసాయ మార్కెట్లు.. విద్యుత్ ప్రాజెక్ట్స్ అన్ని తిరిగి రండి.. అవసరం అయితే ఒకటి రెండు రోజులు ఎక్కువగా ఉండైన సరే, ఏ ఒక్కటి కూడా చూడకుండా, నేర్చుకోకుండా వదిలిపెట్టకండి. సానుకూల మనస్తత్వంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై తెలంగాణలో ఒక స్టడీ టూర్ లా పర్యటించండి. ఇలాంటి అద్భుత పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నామని సిగ్గుపడండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు ఎందుకు తెలంగాణ స్థాయీ అభివృద్ధి ని అమలు చేయమని ఎందుకు అడగలేకపోతున్నారో ఆలోచించండి.
కుళ్ళుబోతు ఆలోచనతో విషం నిండిన మనసుతో ఒక పరాయి జీతగాడు తెలంగాణ మీద తుపాకీ పట్టి ఉద్యమకారులపై అనుచిత ప్రవర్తన చేసిన పసుపునాయకుడు రేవంత్ రెడ్డి కళ్ళతో చూడకండి. మీ సిడబ్ల్యుసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అబివృద్ది దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. రేవంత్ రెడ్డి కళ్ళలో సంతోషం కోసం కేసీఆర్ పై అక్కసుతో చర్చ చేయకండి. అభివృద్ధిని సంక్షేమాన్ని కాక్షించే, ఒక విశాల దృక్పథంతో ఆలోచించి, తెలంగాణ అభివృద్ధి సంక్షేమాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి.
ఇట్లు
మీ డా. దాసోజు శ్రవణ్, బిఆర్ఎస్