BRS Leader Dasoju Sravan | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్రకు కాంగ్రెస్పార్టీ, రేవంత్రెడ్డి చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ రేటెంతరెడ్డిగా ఉన్న రేవంత్.. నేటి నుంచి రైతుల పాలిట రాబందురెడ్డిగా మారిండని ఆయన చెప్పారు.
సోమవారం తెలంగాణ భవన్తో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ పెద్ద కుట్ర చేస్తోంది. తన రక్తాన్ని చెమటగా మార్చి అన్నం పెట్టే రైతన్నకు భరోసాగా సీఎం కేసీఆర్ రైతుబంధు లాంటి పథకం అమలు చేస్తుంటే.. మరోపక రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్, బిజేపీతో కుమ్మక్కయి రైతు నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేస్తోంది. దయచేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు తగిన గుణపాఠం చెప్పాలి’ అని కోరారు.
దేశంలో ఎకడాలేని విధంగా రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ పథకాలకు సీఎం కేసీఆర్ దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేశారని చెప్పారు. గిట్టుబాటు ధరలు, పుషలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు ఇలా అద్భుతమైన రీతిలో రైతులకు కేసీఆర్ అండగా ఉంటే… చూసి ఓర్వలేని రేవంత్, కాంగ్రెస్ ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి దుర్మార్గంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు వస్తే రేవంత్ ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు? రైతులు చల్లాగా ఉంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపుమంట? ఎందుకు రైతుబంధుని ఆపే కుట్ర చేస్తున్నాడు? అని ప్రశ్నించారు.
రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అక్టోబర్లో భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారని దాసోజు శ్రవణ్ చెప్పారు. రైతులు విత్తనాలు వేసే సమయంలో వాళ్లకి అప్పులు, వడ్డీ బెడద లేకుండా ఉండాలంటే కచ్చితంగా పథకం అమలు కావాలని ప్రభుత్వం ప్రజంటేషన్ ఇవ్వడంతో ఈసీ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అనుమతి రాగానే రేవంత్ రెడ్డి మళ్లీ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీకి లేఖ రాశారని చెప్పారు.
తాజాగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కూడా రైతు బంధుపై ఫిర్యాదు చేయబట్టే.. రైతుబంధును నిలిపివేశారని, చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయమని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు సొమ్ము పంపిణీని కాంగ్రెస్ నేతలు ఎలా అడ్డుకున్నారో ఆధారాలతో సహా ఆయన మీడియాకు చూపారు. గతంలోనూ నీటి ప్రాజెక్ట్ల నిర్మాణంలోనూ కోర్టులో కేసులు వేసి, అడ్డుకున్నట్లు తెలిపారు. రైతుబంధుని నిలిపివేయించిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు ఎక్కడికక్కడే గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.