హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వరదలతో విపత్కర పరిస్థితులు ఉంటే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ నగర ఇన్చార్జి దాసోజు శ్రవణ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ముట్టడికి రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపుపై గురువారం కాంగ్రెస్ నేతలకు శ్రావణ్ బహిరంగలేఖ విడుదల చేశారు. ప్రభుత్వ సహాయక చర్యలను అడ్డుకొనేందుకే రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీ ముట్టడికి పిలుపునిచ్చారని, ఇది సామాజిక నేరమని ఆ లేఖలో మండిపడ్డారు. ఇది ప్రజల కోసమా లేక పబ్లిసిటీ కోసమా అని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటావా? లేక ధర్నాల పేరిట అడ్డుకుంటావా? మీ ధర్నా డ్రామాలను పర్యవేక్షించాలా? లేక పోలీసులు ప్రజలకు అండగా ఉండాలా? అని సూటిగా ప్రశ్నించారు.
భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న నాళాలు, వరదలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతుంటే, వారిని ఆదుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం లెకచేయకుండా వర్షంలో తడుస్తూ జీహెచ్ఎంసీ యంత్రాగం, పోలీసులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తలకుమాసిన రాజకీయాలు చేస్తున్న రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, తలాతోకా లేని రేవంత్రెడ్డిలాంటోడు రాజకీయ డ్రామాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర డ్రామాలు కట్టిపెట్టి ప్రజలకు పనికొచ్చే నిర్మాణాత్మక రాజకీయం చేయాలని హితవు పలికారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చ చేద్దామా? అని సవాల్ విసిరారు. చేతనైతే మీ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా పురమాయించాలని సూచించారు.