Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీకి సీనియర్లు రాజీనామా చేసి వెళ్లడం పట్ల దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లం దగ్గరకు ఈగలు పోయినట్టుగా.. నీళ్లు వస్తే కప్పలు చేరినట్టుగా ఇవాళ అధికారంలోకి రావడంతో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ మత్తడిలోకి దూకుతున్నారని చెప్పారు. పార్టీని వీడుతున్న సమయంలో వాళ్లందరూ ఆత్మగౌరవం గురించి మాట్లాడటం బాధగా ఉందని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నాడు కే కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు వీళ్లెవరికీ ఆత్మగౌరవం గుర్తు రాలేదని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అధికారం పోయిన మూణ్నెళ్లలోనే చాలామంది నేతలు ఆగమాగమవుతూ సాకులు చెబుతూ పార్టీని వీడుతున్నారని అన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని.. అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీపై దాడి చేసేందుకు దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గ కార్లలో తిరిగి.. పదేండ్లు అధికారంతో వచ్చిన హోదా, డబ్బు, అధికారాన్ని అన్ని రకాలుగా వాడుకుని దాటవేత ధోరణికి పాల్పడుతున్నారని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆత్మగౌరవం అంశాన్ని లేవనెత్తని మీరు.. అధికారం పోగానే ఆత్మగౌరవం అనే ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఇది వాళ్ల అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దివాంచీ బార్ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు అని దానం నాగేందర్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచే కామెంట్ ఏదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. బీడీలు అమ్ముకునేందుకు కూడా పనికిరాడు అంటూ అవమానించి.. ఆత్మన్యూనత భావంలోకి నెట్టివేసిన రేవంత్ రెడ్డి పంచన చేరే ప్రయత్నం చేసేటప్పుడు ఆత్మగౌరవం గుర్తురావడం లేదా? అని ప్రశ్నించారు.
‘ ఒక్కనాడు కూడా కేటీఆర్ నిన్ను బీడీలు అమ్ముకునేటోడు అని అనలేదే.. కేటీఆర్ ఎప్పుడూ నీ భూకబ్జాల గురించి మాట్లాడలేదే.. కేటీఆర్ ఒక్కనాడు కూడా ఏరకంగా అగౌరవపరచినట్టు కనబడలేదే.. కేసీఆర్ అయితే కన్నకొడుకు లెక్క చూసుకున్నడు.. అందుకే కేసీఆర్ నాకు దేవుడు లాంటి వాడు అని నువ్వే అంటుంటవ్.. చుట్టూ ఉన్నవాళ్ల కోసం దేవుడిని వదిలేస్తావా? దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారు.. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు.. ఇంతకంటే నీచమైన అవకాశవాద రాజకీయం ఇంకోటి ఏదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కన్నతండ్రిలా వ్యవహరించిన కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీ వీడటం ఎంతవరకు న్యాయమో నాగేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ వైఎస్సార్ కూడా కాళ్లు మొక్కలేదు.. కానీ అనేకసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కిండు.. మరి నిజంగానే కేసీఆర్ అవమాన పరిచేలా వ్యవహరించి ఉంటే.. ఆయన కాళ్లు మొక్కేవాడా? అని ప్రశ్నించారు.
దానం నాగేందర్తో పాటు కే కేశవరావు, కడియం శ్రీహరిపైనా దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏ మాత్రం ఇంగితం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన దానం నాగేందర్పై కూడా దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అసలు ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఒక దాంట్లో ఓడిపోయినా.. మరొకటి ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారని అన్నారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దానికి రాజీనామా చేయకుండా.. మరో పార్టీ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే ఆటోమేటిగ్గా అనర్హత వేటు పడుతుందని తెలియజేశారు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు.. కానీ రెండింట్లోనూ మునక తప్పదని ఆయన విమర్శించారు. ఖైరతాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.