హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఢిల్లీలో ఇచ్చే జాతీయ నినాదమైన ‘మొహబ్బత్ కీ దుకాన్ కాస్తా.. క్రూర నియంత వారసత్వాన్ని సీఎం రేవంత్ అకున చేర్చుకోవడంతో తెలంగాణలో ‘హిట్లర్ కా మకాన్’ (హిట్లర్ ఇల్లు)గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నైతికతలోని ద్వంద్వ ప్రమాణాలను సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ‘ఢిల్లీలో కూర్చొని మిమ్మల్ని మీరు రాజ్యాంగ రక్షకుడిగా ప్రకటించుకొంటూ తిరగడం.. మీరే స్వయం గా నియమించిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, రక్తపిపాసి అయిన అడాల్ఫ్ హిట్లర్ను బహిరంగంగా కీర్తిస్తూ, అతని ‘హత్యల దళాన్ని’ (అసాసినేషన్ స్వాడ్స్) తన పాలనా స్ఫూర్తిగా చెప్పుకొంటుంటే చూస్తూ మౌనంగా ఉండటమేంటి?’ అని ప్రశ్నించారు. ఇది కేవలం ఫాసిస్ట్ (నియంతృత్వ) పరిపాలనా మానసిక స్థితికి నిదర్శనం మాత్రమే కాదని, మన దేశ పునాది విలువలపై జరిగిన క్షమించరాని దాడిగా అభివర్ణించారు.
‘నియంతృత్వ పద్ధతులను అభినందించడం, స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధప్రాంతాల విధ్వంసంతో గర్వంగా పోల్చుకోవడమే మీ పార్టీ అసలైన పరిపాలనా విధానమైతే.. ఏఐసీసీ తన భావజాల ముసుగును తొలగించి, తన పేరును అధికారికంగా ‘ఆలిండియా నాజీ పార్టీ’గా మార్చుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు. రేవంత్రెడ్డి నియంతృత్వ ధోరణిని రాహుల్గాంధీ మౌనంగా సమర్థిస్తున్నారని, దీనిని దేశమంతా గమనిస్తున్నదని పేర్కొన్నారు. హిట్లర్ సిద్ధాంతాలతో సీఎం రేవంత్ పోల్చుకోవడంపై రాహుల్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.