Harish Rao : రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని అయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే.. బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతదని ఆయన వ్యాఖ్యానించారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో ‘ఈ బువ్వ మేం తినలేం.. మమ్మల్ని తీసుకెళ్లండి’ అని విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని, మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని హరీష్రావు ఆవేదన వ్యక్తంచేశారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటనను మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు క్యూ కట్టేవారని, ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటిబాట పట్టేందుకు క్యూ కడుతున్నారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని అన్నారు. ‘ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేం ఉండలేం’ అంటున్నారని చెప్పారు.
కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి పిల్లలను ఇళ్లకు తోలుకపోతున్నారని హరీష్రావు అన్నారు. ఏడాదిలో మీ పాలనా వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది
రేవంత్ రెడ్డి గారు..? ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉండి భావిభారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నావు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా విద్యార్థుల ప్రాణాలు కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్రావు అన్నారు.