మానకొండూర్ : మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వర్షాకాలంలోపే మరమ్మతులు పూర్తిచేసి మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్, కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాల బీఆర్ఎస్ మండలాధ్యక్షులతో ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
వేసవి ప్రారంభానికి ముందే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగునీటి, కరెంట్ కష్టాలు వచ్చాయని రైతులు వాపోతున్నారని, ఇలా అయితే మున్నుందు చాలా కష్టమేనని వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నీటిని కాల్వల ద్వారా గ్రామాల్లోని కుంటలు, చెరువులను నింపి భూగర్భజలాలను పెంచడంతో ధాన్యం ఉత్పత్తులు పెరిగి ఆన్నదాతలకు సాగునీటి కష్టాలు తప్పాయని గుర్తు చేశారు. దాదాపు పదేళ్లు తెలంగాణలో రైతులకు సాగునీటి, కరెంట్ కష్టాలు లేవన్నారు. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభానికి ముందే రైతులకు సాగు నీటి కష్టాలు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చిచెప్పారు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిందో..? దానిపై రేవంత్ సర్కార్ విచారణ జరిపించాలని కోరారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలే కానీ, మేడిగడ్డ బరాజ్ కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బూతద్దంలో పెట్టి చూపించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని మండిపడ్డారు. వచ్చే వానాకాలంలోపు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తిచేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కానీ ప్రాజెక్టును మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేస్తే మొత్తం పిల్లర్లు కుంగిపోయి భారీ నష్టం వాటిల్లితే రైతాంగానికి తీవ్ర నష్టం కష్టం కలుగుతుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.