Balka Suman | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తీవ్ర అవమానం జరిగిందని, రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ, బీసీ బిడ్డలను కింద కూర్చో బెట్టారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, వాసుదేవ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ కొండా సురేఖను కిందా ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించారు.
దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎకడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? అని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన భట్టి విక్రమార్కనే అవమానించారని, 74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో నేటికీ అవమానం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో యావత్ దళిత జాతిని అవమానించాని బాధపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బట్టి విక్రమార్క ఫొటో పకన పెడుతున్నారని, ప్రభుత్వ యాడ్స్లో భట్టి విక్రమార ఫొటోలు లేకుండా చేస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. యాదగిరి గుట్టలో జరిగిన దుర్ఘటనపై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విసూనురి రామచంద్ర రెడ్డి, ఎర్రపహడ్ ప్రతాప్ రెడ్డి లాంటి వాడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ స్పందించాలన్నారు. దళితుడైన మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నారని, వెంటనే భట్టికి జరిగిన అవమానంపై స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో కుల సంఘం మీటింగ్లో బీసీలు ఎస్సీలకు పాలన చేత కాదు అని రేవంత్ మాట్లాడారని, కులసంఘం మీటింగ్లో చెప్పినట్టే రేవంత్ పాలనా ధోరణి ఉందని అన్నారు. భట్టికి జరిగిన అవమానకరపు ఘటనలు భవిష్యత్లో జరగకుండా చూడాలని కోరారు.