ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగుల పార్టీ అని, తెలంగాణ వచ్చాకే కేసీఆర్ నేతృత్వంలో తమ లాంటి వాళ్లకు పెద్దల సభకు వెళ్లే అవకాశం వచ్చిందన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో లింగయ్య యాదవ్ మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికార దురహంకారంతో మాట్లాడుతున్నారని, దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని లింగయ్య యాదవ్ మండిపడ్డారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని, సాగు నీరు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడి నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చి నాగార్జున సాగర్ కింద పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. రేవంత్ లాంటి నీచమైన భాష వాడుతున్న సీఎం దేశంలో మరొకరు లేరని ఎద్దేవా చేశారు. పంటలను దేవుడే కాపాడాలి అని ఓ మంత్రి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను గెలిపించినందుకు శిక్ష అనుభవిస్తున్నామని ప్రజలు భాధ పడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని.. తాము పార్టీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఐదేండ్ల తర్వాత వంద సీట్లతో ఏర్పడబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.