ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలో జరగడం అదృష్టమని చెప్పారు. ప్రజలు ఏ ప్రయోజనాల కోసం స్వరాష్ర్టాన్ని సాధించారో.. వాటన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని వివరించారు.
కృష్ణా, గోదావరి జలాలను పంటలకు తరలిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్తో పంట భూములను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు అందుతుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకాలను స్వరాష్ట్రం వచ్చాకనే పూర్తి చేశామని, జాతీయ రహదారులను తీసుకొచ్చామని వివరించారు. కొన్ని జిల్లాల ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టిందని చెప్పారు.
బీటీపీఎస్ నిర్మాణం పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించామని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్ట్లతో జిల్లాలోని కరువు మండలాలైన వేంసూరు, తిరుమలాయపాలెం సస్యశ్యామలమయ్యాయని పేర్కొన్నారు. ఆయిల్పాం సాగుకు అవసరమైన్ని ఫ్యాక్టరీలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. తెలంగాణ మాడల్ను సీఎం కేసీఆర్ దేశావ్యాప్తంగా అమలు చేస్తారని, 14 ఏండ్లు కష్టపడి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. మున్ముందు దేశ ప్రజలకూ మేలు చేస్తారన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ఖమ్మం సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా ప్రజలను తరలించాలని పిలుపునిచ్చారు.