రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ అలియాస్ తెలంగాణ సత్తెవ్వ(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, కరీంనగర్లోని దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన వేములవాడ మండలం చీర్లవంచలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుని, సత్తెవ్వ భౌతిక కాయంపై పార్టీ జెండాను కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తెవ్వ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్తెవ్వ భౌతికకాయాన్ని చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. చెమ్మగిల్లిన కండ్లతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా సత్తెవ్వ పాడె మోసి తుది వీడ్కోలు పలికారు.
కేటీఆర్తో పాటు వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కూడా పాడె మోశారు. అంత్యక్రియల ఖర్చును కేటీఆర్ భరించారు. సత్తెవ్వ కుటుంబానికి అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, జిందం చక్రపాణి, గజభీంకార్ రాజన్న, పడిగెల రాజు, సెస్ డైరెక్టర్ హరిచరణ్రావు, బొల్లి రామ్మోహన్తోపాటు సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలం, వేములవాడ అర్బన్ మండలం నుంచి బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
సత్తెవ్వ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఆమెకు తెలంగాణ సత్తెవ్వగా పేరొచ్చింది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించగా, పార్టీ నేతలతో కలిసి ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ అంటూ ఉద్యమ సమావేశాలకు వెళ్తుండేది. ఎక్కడ కేసీఆర్ ఫొటో కన్పించినా, టీవీలో చూసినా ఉద్వేగానికి గురయ్యేది. 2009లో సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో సత్తెవ్వకు మరింత గుర్తింపు లభించింది. కేసీఆర్తోపాటు కేటీఆర్పైనా సత్తెవ్వ ప్రేమాభిమానం పెంచుకున్నది. జిల్లాలో కేటీఆర్ ఏ మీటింగ్ పెట్టినా వెళ్లేది. సభల్లో సైతం ‘జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్’ అంటూ నినదిస్తూ ఉద్యమ చైతన్యాన్ని రగిల్చేది.
సత్తెవ్వ స్వగ్రామం చీర్లవంచ మధ్యమానేరులో పూర్తిగా ముంపునకు గురికాగా, కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు. అంతేకాదు 2022లో కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో తెలంగాణ సత్తెవ్వను కేసీఆర్ వీరాభిమాని అంటూ పరిచయం చేశారు. సత్తెవ్వ భర్త నర్సయ్య 20 ఏండ్ల క్రితమే మరణించాడు. కొడుకు రవి, కూతురు ఉన్నారు. వీరికి వివాహాలు జరిపించింది. సరిగ్గా పది నెలల క్రితం కొడుకు రవి పాముకాటుతో చనిపోగా, అప్పటి నుంచి మనోవేదనకు గురైంది. అయినప్పటికీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నది. 15 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడిన సత్తెవ్వ కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చేర్పించారు. కడుపులో గడ్డలు కావడంతో ఆపరేషన్ నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.