ఖమ్మం, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శనివారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని పలు సంస్థల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పతనం ఖమ్మం నుంచి ప్రారంభమైందని అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ది మోసాలు, కుంభకోణాల చరిత్ర అనేది అందరికీ తెలుసని అన్నారు.
గత ఎన్నికల వరకు మాజీ ఎంపీ పొంగులేటిని గుత్తేదారు అని విమర్శించిన భట్టి, ఇప్పుడు అతడిని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డిని కాంట్రాక్టర్ అని విమర్శించే భట్టికి.. పొంగులేటి గుత్తేదారుడిలా కన్పించడం లేదా? అని అడిగారు. ప్రభుత్వం నుంచి పలు కాంట్రాక్టులు పొంది, ప్రాజెక్టులు కట్టకుండానే మోసం చేసిన భట్టి.. సీఎం కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉన్నదని తాతా మధు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తిరస్కరించిన పొంగులేటిని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని అన్నారు.
2018 ఎన్నికలకు ముందు జిల్లాలో పొంగులేటి ఏమి ఏశారో? ఆ తర్వాత ఏమి చేశాడో? ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. ఇతర పార్టీల సభలను అడ్డుకునే నీచ సంస్కృతి బీఆర్ఎస్కు లేదని చెప్పారు. సభకు ప్రజలు రారనే ఉద్దేశంతో ముందుగానే బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, వీటిని సహించేది లేదని తాతా మధు హెచ్చరించారు.