ఆరు గ్యారెంటీల అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టిందని విమర్శించారు. మానకొండూర్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ విద్యార్థి యువ చైతన్య సదస్సు అలుగునూర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి బోయిన్పల్లి వినోద్కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోయిన్పల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే 2001లో తెలంగాణ ఉద్యమం పుట్టిందని అన్నారు. 14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చామని.. పదేండ్లలో 1.61లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలకు గత ప్రభుత్వం పరీక్షలు కూడా నిర్వహించిందని తెలిపారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మాత్రం ఆంధ్ర ప్రాంతంలో నిర్మించారని… కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేసి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కరెంటు కోతలు మొదలయ్యాయని మండిపడ్డారు.
2014 లో ఎంపీగా గెలిచిన తర్వాత కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్, కరీంనగర్ చుట్టుపక్కల నాలుగు జాతీయ రహాదారులు, వెయ్యి కోట్లతో కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చానని బోయిన్పల్లి వినోద్కుమార్ తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ మంజూరు చేయించి.. 50 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించామని చెప్పారు. కానీ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు దాన్ని తరలించిందని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు.. ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాలేదని విమర్శించారు. బండి సంజయ్కు యువకులు, విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం నుంచి నైపుణ్యాభివృద్ది కేంద్రాలు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. హైదరాబాద్కు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని వచ్చి 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఇంకా 23 నవోదయ విద్యాలయాలు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఐదేండ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాని బండి సంజయ్ ఏ అర్హతతో ప్రజలను ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.