సిరిసిల్ల టౌన్/ముస్తాబాద్, మార్చి 19: వడగండ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముస్తాబాద్, పోతుగల్, సేవాలాల్ తండా, గన్నెవానిపల్లెలో పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముస్తాబాద్లో విద్యుత్తు స్తంభం కూలి రైతు ఎల్సాని ఎల్లయ్య చనిపోయిన ప్రాంతాన్ని వినోద్కుమార్ పరిశీలించారు.
అనంతరం ఎల్లయ్య ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలను తక్షణమే సర్వే చేయించి, రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఫోన్ ద్వారా కోరారు. వరి పంటలు పొట్టదశలో ఉన్నాయని, ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.