Vinod Kumar | కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ఇద్దరు కలసి ఏదైనా చేసే అవకాశముంది.’ అని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. 400 మంది ఎంపీలను గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పేవారికి అవగాహన లేదని విమర్శించారు. పార్లమెంట్లో జాతీయ పార్టీ ఎంపీలే ఉండాలనడం శుద్ధ తప్పన్న ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీలుగా ఉండాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఐదేళ్లలో రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేశానంటున్నడు.. దీనిపై మీరేంటారు?
వినోద్ : సంజయ్ చెప్తున్న లెక్కలన్నీ హాస్యాస్పదంగా ఉన్నయ్. ఎంపీగా ఎవరున్నా చట్ట ప్రకారం కొన్ని నిధులను కేంద్రం తప్పనిసరిగా ఇస్తుంది. 2005లోనే కేంద్రం ఈ చట్టం తెచ్చింది. ఉపాధిహామీ, పంచాయతీలకు నిధు లు కేటాయింపు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఈ నిధులు కూడా ఆయనే తెచ్చినట్టు చెబుతూ కరపత్రాలు పంచుతున్నడు. ఒక ఎంపీగా ఏనాడైనా సంజయ్ పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై నోరు విప్పారా?. రాష్ర్టానికి రావాల్సి న జాతీయ ప్రాజెక్టుల గురించి ప్రశ్నించారా?. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏవైనా ప్రయత్నాలు చేశా రా?. మనకు రావాల్సిన ట్రిపుల్ ఐటీ ని ఇతర రాష్ర్టాలు తన్నుకెళ్తే.. అడ్డుకునే ప్రయత్నమైనా చేశారా?. కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ పాఠశాలనైనా తెచ్చారా? వైకుంఠధామాలు, మొక్కల పెంపకానికి, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, చెత్తసేకరణ, పాలు, గుడ్లకు ఇచ్చే నిధులు కూడా తానే తెచ్చినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అదీగాక కులమతాల పేరుతో యువతను రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
400 మంది ఎంపీలుగా గెలిస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చేస్తున్న ప్రచారంపై మీరేమంటారు?
ఇది రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్లు మాట్లాడే మాటలు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మూడు రకాల అవకాశముంది. మొదటిది సింపుల్ మెజార్టీ, రెండోది 2/3 మెజార్టీ, మూడోది 2/3 మెజార్టీతోపాటు దేశంలో సగం రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి. 400 సీట్లు గెలిచినా.. ఇంకేం చేసినా ఎవరి ఇష్టానుసారం వాళ్లు రాజ్యాంగాన్ని మార్చేందుకు వీలు లేదు. అభివృద్ధి చేసింది లేక ఇలా రాజ్యాంగాన్ని ముందుకు తెచ్చారు.
కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని మీరు.. ఈ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వంద రోజుల్లోనే వైఫల్యానికి కారణం ప్రధానంగా వారి పనితీరే. గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రాజెక్టులు, చెరువులు నింపే అవకాశం ఉన్నా నింపకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. మేడిగడ్డ వద్ద రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. మూడు నెలల్లోనే దాదాపు 50 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనయ్. కేసీఆర్ గెలిచి ఉంటే.. ఇప్పటికే కాపర్డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోసే వారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తాగునీటి కటకట వచ్చింది.
జాతీయ పార్టీల ఎంపీలుంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై మీరేమంటారు?
తెలంగాణ సోయి, స్పృహ ఉన్న ఎంపీలు ప్రస్తుతం పార్లమెంట్లో ఉండడం అత్యవసరం. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు గెలిచినా.. తెలంగాణను అగం చేస్తరు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడరు. ఒక్క మాట చెప్పాలంటే హైదరాబాద్ మహానగరానికి ప్రమాదం పొంచి ఉందని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీడీపీ చంద్రబాబు కలిసి ఏమైనా చేయొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే పార్లమెంట్లో గట్టిగా మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే. బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచి తెలంగాణ హక్కులపై ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడారా? తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లాంటి పేద పిల్లలకు నవోదయలో సీటొస్తే వారి తల్లిదండ్రులు సంతోషిస్తారు.
మీకు ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని నేను భావిస్తున్న. నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పనులు, బండి సంజయ్ చేసిన పనులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నరు. ఏ కోణంలో చూసినా ప్రజల మద్దతు నావైపే ఉంది.
నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నరు?
నేను చిన్నప్పటి నుంచే విద్యార్థి రాజకీయాల్లో ఉన్న. వామపక్ష రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన. తెలంగాణ కోసం ఏర్పాటైన బీఆర్ఎస్లో నేనొక వ్యవస్థాపకుడిని. నాడు తెలంగాణ కోసం, నేడు తెలంగాణ సంక్షేమం దాదాపు 2001నుంచి నా జీవితాన్ని అంకితం చేసిన. ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తా. ఐదేళ్లలో బండి సంజయ్ నియోజకవర్గానికి లేదా తెలంగాణకు ఏమైనా చేశాడా? కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉన్నా గోదావరి, కృష్ణ ప్రాజెక్టులకు జాతీయహోదా తెచ్చేందుకు కృషి చేశాడా? ఒక్కసారైనా ఆ వాటి గురించి మాట్లాడిండా? అవన్నీ బేరీజు వేసుకొని ఓటేయ్యాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్న.
ఎంపీగా గెలిపిస్తే.. ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు?
కరీంనగర్లో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తా? 150 ట్రేడ్స్ ఉన్న సెంటర్ను నేను సింగపూర్లో స్వయంగా చూసిన. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)గా సింగపూర్కు ప్రపంచ ఖ్యాతి ఉంది. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని గొప్పదనం తెలుస్తుంది. ఇలాంటిదే కరీంనగర్లో ఏర్పాటు చేయిస్తా. అంతేకాకుండా కరీంనగర్ను ఎడ్యుకేషన్ హాబ్గా తీర్చిదిద్దుత. ఐఐటీ, ఐఎస్ఈర్, ఐఐఎం లాంటి కేంద్ర విద్యాసంస్థలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. గెలిపిస్తే ట్రిపుల్ ఐటీ తీసుకొస్తా. నవోదయ స్కూళ్లను సాధిస్త. సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కృషిచేస్త. జిన్నింగ్ మిల్లులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాం. వేములవాడ, కొండగట్టు లాంటి ఆలయాలను ప్రసాద్ స్కీంలో చేర్పించి అభివృద్ధి చేస్తా. రాజీవ్ రహదారిని జాతీయ ఎక్స్ప్రెస్ హైవేగా ప్రకటింపజేస్తా. కాజీపేట-కరీంనగర్, కరీంనగర్-పిట్లం, కరీంనగర్-భూపాలపల్లి, కరీంనగర్-రాయపట్నం వంటి రహదారులపై ప్రత్యేక దృష్టిపెడుతా. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వైలైన్ పూర్తిచేయిస్తా.