హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పార్టీ అంతర్గత విషయాలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు కేశవరావు భేటీ అనంతరం మీడియాతో చెప్పారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడం, లోక్సభ ఎన్నికలు, బీఆర్ఎస్ పరిస్థితిపై చర్చించినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ వంటివారిని కేవలం రాజకీయ కుట్రతోనే అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇటీవల తనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి కలిశారని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారని చెప్పారు. దీంతో 84 ఏండ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా కలిగిందని వెల్లడించారు.
బీఆర్ఎస్లో తనకు సముచిత గౌరవం దక్కిందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనకు గౌరవం ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తనను బాగా చూసుకున్నారని అన్నారు. తాను, తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నామ ని చెప్పారు. తన కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పాడని వెల్లడించారు.
బీఆర్ఎస్లోనే కొనసాగుతా: విప్లవ్కుమార్
బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని రాష్ట్ర టీయూఎఫ్ఐడీసీ మాజీ చైర్మన్ కే విప్లవ్కుమార్ తెలిపారు. తన తండ్రి కే కేశవరావు, తన సొదరి, మేయర్ విజయలక్ష్మి పార్టీ మార్పుతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమ కుటుం బ సభ్యులు పార్టీ మారినా తాను మాత్రం వారితో వెళ్లడం లేదన్నారు.
బీఆర్ఎస్కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని ప్రకటించారు. తమ కుటుంబసభ్యులు పార్టీ మారిన తర్వాత అన్ని విషయాలను చెబుతానని పేర్కొన్నారు.