హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితిని ఎన్నారైలు స్వాగతించారు. బీఆర్ఎస్కు ముక్తకంఠంతో మద్దతు పలికారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్కు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశ దశ, దిశ మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసిన మాదిరిగానే దేశాన్ని కూడా అభివృద్ది పథంలో నడిపిస్తారని పేర్కొన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తమ పూర్తి మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం 52 దేశాల ఎన్నారైలతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇదే తొలి సమావేశం. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఏర్పాటుపై కేవలం తెలంగాణ ఎన్నారైలు మాత్రమే కాకుండా వివిధ రాష్ర్టాల ఎన్నారైలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని 52 దేశాల ఎన్నారైలు తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్తోనే దేశాభివృద్ది సాధ్యమని ఉద్ఘాటించారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని వెల్లడించారు. ఈ నెల 22న ఆస్ట్రేలియాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్కు మద్దతు పలికిన వారిలో అనిల్ కూర్మాచలం (లండన్), జగన్ వొదినాల (న్యూజిలాండ్), అశోక్, నవీన్, నవీన్ భువనగిరి, చీక చంద్రశేఖర్, సృజనరెడ్డి, అబ్దుల్ జాఫర్, సత్య (యూకే), శ్యామ్బాబు ఆకుల-(డెన్మార్), నాగరాజు గుర్రాల, అరవింద్, నరేందర్రెడ్డి (సౌతాఫ్రికా) మహిపాల్ (ఒమన్), అభిలాష, వెంకట్, సురేశ్ (కువైట్), సందీప్ (మలేషియా), సతీశ్కుమార్, బొలిశెట్టి వెంకటేశ్ (బహ్రెయిన్), శ్రీధర్ అబ్బగొని (ఖతర్), ఆకుల సురేందర్ (యూఏఈ), కృష్ణ, భూభలం-కెనడా, రాఘవ (చెక్రిపబ్లిక్), అభిలాష్ (హంగేరి), రవీందర్రెడ్డి (చైనా), నరసింహ, అరవింద్, భాసర్ పిన్న, శివకుమార్శర్మ (యూఎస్ఏ), రంగు మహేశ్గౌడ్(ఆస్ట్రియా), సాయికిరణ్ (పోలాండ్), మహేందర్ (స్వీడన్), నిరంజన్ పొద్దుటూరి (అట్లాంటా), నరసింహారెడ్డి (టాంజానియా), వీరేనా గాండ్ల- కేప్టౌన్, రజినీకాంత్, శ్రీనివాస్, రవి (డల్లాస్) తదితరులు ఉన్నారు.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు
ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ రాజకీయ దురంధరుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణను ఎనిమిదేండ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపి, ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం కావడం ఆయన పరిపాలనా దక్షత, పట్టుదలకు నిదర్శనం. ఆయన అనుభవం, కార్యదీక్ష, దక్షత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
– మల్లికేశ్వరరావు కొంచాడ, ఐటీ మేనేజర్, తెలుగుమల్లి సంపాదకుడు, ఆస్ట్రేలియా
కేసీఆర్ నేతృత్వంలోనే రాజకీయ ప్రత్యామ్నాయం
రాజకీయ అనుభవం, దేశ ప్రజల మేలు కోరే వ్యక్తిత్వం ఉన్న కేసీఆర్ నేతృత్వంలో మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటవుతుంది. సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం పయనిస్తుంది. దేశ రాజకీయాల్లో ధోరణులు(ట్రెండ్), పరిస్థితులు (సిచ్యువేషన్స్), సమీకరణాలు (ఈక్వేషన్స్) అనే మూడు కీలక అంశాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బహుముఖ, నిర్మాణాత్మక పరివర్తన పాత్రను పోషించే సత్తా ఉన్న నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే.
– డాక్టర్ గిరిధర్ పొన్నం, ఒంటారియో, కెనడా
కేసీఆర్ నాయకత్వంలోనే దేశంలో గుణాత్మక మార్పు
దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నా కనీసం 2 లక్షల మెగావాట్లు కూడా వాడుకోవడం లేదు. తెలంగాణలో కాళేశ్వరం నిర్మించి కరువును తరిమేసిన నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది.
– ఉత్తమ్ కుమార్, కెన్స్లీ కాలేజీ ఫౌండర్ చైర్మన్, క్యుబెక్, కెనడా
తెలంగాణ బిడ్డలు గర్వపడే రోజు
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఉద్దేశించిన ఈ రోజు తెలంగాణ బిడ్డలు గర్వపడే రోజు. సకల జనులను ఏకంచేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ఇప్పుడు యావత్ దేశానికి తెలంగాణ మాడల్ను పరిచయం చేసేందుకు ముందుకు సాగడం ఎంతో హర్షణీయం. దూరదృష్టి, సంకల్పబలంతో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కేసీఆర్ నడుంబిగించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం.
– కాసర్ల నాగేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు