సిద్ధిపేట : దేశంలో ఆదర్శపాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చారని మెదక్ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడిన విధంగానే దేశానికి ఆదర్శ పాలన అందించడమే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి , సంక్షేమం చూసి కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రాబోయే రోజుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా కీలకపాత్ర పోషించనున్నారని వివరించారు. ఇప్పటికే అనేక మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్కు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేశారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు,ఎస్సీ, రెడ్డి, కుర్మ కమ్యూనిటీహాల్ భవనాలకు భూమి పూజ చేశారు. బాలవికాస వాటర్ ప్లాంట్ ఏటీడబ్ల్యూ కార్డులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
పలు పార్టీలకు చెందిన యువకులు ఎంపీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, సర్పంచ్ నిర్మలా రాజిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ పాల రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.