హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అవినీతి, మతతత్వ పాలనను అంతమొందించడంలో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషించనున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పా రు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు బీఆర్ఎస్తో సమాజ్వాదీ పార్టీ కలిసి పనిచేస్తుందని తెలిపా రు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ సిద్ధమవుతున్నదని, తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్పార్టీలు ఒక స్పష్టమైన ఎజెండాను రూపొందిస్తున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు వచ్చిన అఖిలేశ్ మంగళవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ రాజకీయాలు, బీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. పలు ప్రశ్నలకు అఖిలేశ్ సమాధానాలు ఆయన మాటల్లోనే..
సరైన సమయంలో బీఆర్ఎస్ ఆవిర్భావం
దేశ ప్రజలకు ఒక నమ్మకమైన, ప్రత్యామ్నా య రాజకీయపక్షాన్ని 2024 ఎన్నికలకు ముం దే ఆవిష్కరించడంలో, దేశ పునర్నిర్మాణాన్ని చేపట్టడంలో బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ గొప్ప పాత్ర పోషించనున్నాయి. కేసీఆర్ సరైన సమయంలో బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఇదో కీలక పరిణామం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని అనుబంధ సంఘ్పరివార్ వంటి సంస్థలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, పరిపాలనాపరంగా ఈ విధ్వం సం కొనసాగుతున్నది. మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ.. అంతకుమించి విఫల ఆర్థిక విధానా లు అమలుచేస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లింది.
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వంటి నేత, బీఆర్ఎస్ వంటి పార్టీ ప్రజల కోణంలో పరిపాలన సాగించే.. ఆర్థిక అంశాలపై లోతైన అవగాహనతో దేశ అవసరాలు తీర్చేందుకు పనిచేస్తాయన్న నమ్మకం ఉన్నది. దేశాన్ని పునర్నిర్మించే బాధ్యతను బీఆర్ఎస్, ఎస్పీ తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 2024 ఎన్నికలకు ముందే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడుతుందన్న నమ్మకం ఉన్న ది. బీజేపీ మంద బలాన్ని మా సమిష్టి కృషితో ఓడిస్తామన్న నమ్మకం ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియలో బీఆర్ఎస్ అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నది. ఇంకా చెప్పాలంటే.. విపక్షాలను ఏకం చేసేందుకు బీఆర్ఎస్ ఒక శక్తిలా అవతరిస్తుంది. ఎలాగంటే.. ఒక్కొక్క ముత్యా న్ని దగ్గరగా పేర్చి దండలా మార్చేందుకు ఉపయోగపడే ఒక దారంలా కేసీఆర్ ఉంటారు.
బీఆర్ఎస్ ఒక బలమైన శక్తి
దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా తెలంగాణ ఉన్నది. దక్షిణ భారతదేశంలో కేసీఆర్కు, బీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్నది. వ్యవస్థాగతంగా, రాజకీయంగా కేసీఆర్ బలమైన నేత. బీజేపీ అబద్ధాలను.. ఆ పార్టీ డొల్లతనాన్ని బయటపెడుతూ.. ప్రజల పక్షాన కేసీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజామోదమైన అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీపై పోరాటం చేస్తున్న క్రమంలో ఇవన్నీ రాజకీయంగా, ఎన్నికల్లో, వ్యవస్థాపరమైన బలాన్ని ఇస్తాయి. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీలు విపక్షాలను కూడగట్టే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. బీఆర్ఎస్ అత్యంత కీలకమైనది. బీజేపీని ఎదుర్కొనే మిత్రులుగా ఏకతాటిపైకి వచ్చి.. బీజేపీపై కొట్లాడుతాం.
బీజేపీ అంత చెత్త ప్రభుత్వం లేదు..
దేశంలోని ప్రతీ రంగాన్ని బీజేపీ, దాని అనుబంధ సంఘ్పరివార్ భ్రష్టుపట్టించాయి. దేశానికి స్వాత్రంత్యం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన.. చెత్త ప్రభుత్వం మరొకటి రాలేదు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు బీజేపీ వ్యతిరేకం. దాని లక్ష్యం ఒక్కటే.. తన పెట్టుబడిదారీ మిత్రులకు ఉపయోగపడటం. దేశంలోని రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూపాయి మారకం విలువ పడిపోతున్నది. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిపోతున్నది. వీటిపై దృష్టిసారించాల్సిన బీజేపీ ప్రజల మధ్య మతచిచ్చు రగిల్చి ‘విభజించు- పాలించు’ అన్న బ్రిటిష్వారి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. ప్రజావ్యతిరేక, అభివృద్ధిలేమి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేం ప్రజల ఆకాంక్షలను ఆకళింపు చేసుకొని ఉమ్మడిగా పోరాటం చేస్తే చాలు.. లక్ష్యం నెరవేరుతుంది.