హనుమకొండ సబర్బన్, మే 6 : గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎండగట్టేందుకు బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతుసంగ్రామ సదస్సు నిర్వహించారు. దీనికి పోటీగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లోనే రాష్ట్ర స్థాయి రైతు మేళాను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టింది. మొదటి రోజు ముగ్గురు మంత్రులు హాజరవడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో సభా ప్రాంగణం హడావుడి కనిపించింది. రెండో రోజు బుధవారం ఆయా వ్యవసాయ క్లస్టర్ల నుంచి ఏఈవోలు బలవంతంగా రైతులను తరలించే ప్రయత్నం చేశారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీజీఏఎఫ్డబ్ల్యూసీ మెంబర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి, స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్ రవి హాజరయ్యారు.
వారు మాట్లాడుతుండగా రైతులు బయటకు వెళ్లే ప్రయత్నం చేయడంతో సాయంత్రం మీటింగ్ అయిపోయే వరకు బస్సులు కదలవని హెచ్చరించడంతో తప్పని పరిస్థితుల్లో కొద్దిసేపు కూర్చున్నారు. మధ్యాహ్నం కాగానే ఓపిక నశించిన రైతులు గుంపులు గుంపులుగా బయటకు వెళ్లిపోగా.. క్షణాల్లోనే సభా ప్రాంగణం మొత్తం ఖాళీ అయింది. రెండు వేల మంది సామర్ధ్యం ఉన్న సభా స్థలిలో పట్టుమని 10 మంది రైతులు కూడా లేకపోవడం విశేషం. ముఖ్యఅతిథులు, అధికారులు రైతులు లేకుండానే ఖాళీ కుర్చీలకు తమ ప్రసంగాలు వినిపించడం విస్మయానికి గురిచేసింది. తమకు అవసరం వచ్చే ఏ ఒక్క పథకాన్ని, అవసరం వచ్చే అంశాలను సభలో వివరించలేదని రైతులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ రైతు మేళా ఎందుకో అని ఎద్దేవా చేశారు. మీటింగ్కు రాకుంటే రైతుభరోసా రాదని, వడ్ల బోనస్ రాదని అంటేనే వచ్చామని కొందరు రైతులు చెప్పుకొచ్చారు.