Harish Rao | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ అనేది ఒక అంశమే కాదని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన బీఆర్ఎస్ తెలంగాణ సాధన దశలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసిందని, అందులో ఎన్నికల్లో గెలుపు ఓటములు ఒక భాగమని హరీశ్రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశం గర్వపడే రీతిలో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పార్టీ శ్రేణులు ఎవరికివారు ద్విగుణీకృత ఉత్సాహంతో ముం దుకు సాగాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. తప్పులు పునరావృతం కాకుండా అన్నిస్థాయి ల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే బీఆర్ఎస్దే విజయమన్నారు. సొంతపార్టీకి నష్టం చేసేవారిని గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. తాండూరు, పరిగి, వికారాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణాలను లోతుగా విశ్లేషించుకొని ముందుకు సాగాలని చెప్పారు. మళ్లీ సీఎంగా కేసీఆరే ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా స్థిరమైన అభిప్రాయం ఉన్నా పార్టీ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. చెవెళ్ల సెగ్మెంట్లో బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య 22 శాతం ఓట్ల తేడా ఉన్నదని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ కచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ చరిత్రలో ఎంపీ రంజిత్రెడ్డి పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని సమావేశంలో పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. అన్ని వర్గాలకు, అన్ని స్థాయిలవారికి అందుబాటులో ఉంటూ తలలో నాలుకలా వ్యవహరించారని ప్రశంసించారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నారని వివరించారు. పార్టీ క్యాడర్ బలం, కేసీఆర్ నాయకత్వం చేవెళ్లకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. మరోసారి చెవెళ్ల లోక్సభ స్థానంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ నాయకులు, కార్య కర్తలు అభిప్రాయపడ్డారు.
చేవెళ్ల లోకసభ స్థానంపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎన్నటికైనా బీఆర్ఎస్ పార్టీయే రక్ష అని తెలిపారు. అం దరం కలిసికట్టుగా పనిచేసి మరోసారి రంజిత్రెడ్డిని ఎంపీగా గెలిపిస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో చేవెళ్ల లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, నేతలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినంత మాత్రాన పార్టీ శ్రేణులు ఎక్కడా చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల బలంతోపాటు పార్టీ శ్రేణుల కార్యదక్షతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డవారే రాజకీయాల్లో, జీవితంలో ఉన్నతస్థితికి వస్తారని చెప్పారు. చిన్నచిన్న అంశాలను బూచిగా పెట్టుకొని పార్టీకి నష్టం చేయాలని చూడటం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిందని, వాటిని నిత్యం ప్రజలకు గుర్తుచేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైనే ఉన్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చేముందు సచివాలయంలో లంకెబిందెలు ఉండవనే కనీస స్పృహ లేకుండా మాట్లాడి కాంగ్రెస్ అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రతీ అంశంలో తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనతో సరిపోల్చి చూస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన పనిచేసిన వాళ్లనే ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారని తెలిపారు.