హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అడ్డదారులు తొక్కి అయినా సరే.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కా ర్ ఎత్తులు వేస్తున్నది. బీఆర్ఎస్ భౌతిక, నైతిక విజయాన్నీ ‘చే’జిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నది. ‘నేనే రాజు…నేనే మంత్రి’ అని ప్రకటించుకున్న రేవంత్కు 36 మున్సిపాలిటీల్లో ‘హంగ్’ తీర్పుతో ప్రజలు షాక్ ఇచ్చారు. ‘కిందపడినా నాదే పైచేయి’ అని చెప్పుకొనేందుకు హస్తం పార్టీ నేతలు ఆరాటపడుతున్నా రు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. ఇప్పటికే అధికార పార్టీ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నది. స్పష్టమైన మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలతోపాటు హంగ్ మున్సిపాలిటీల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని బాధ్యుల కు సంకేతాలిచ్చింది.
హంగ్ వచ్చిన 36 మున్సిపాలిటీల్లో 17 చోట్ల బీఆర్ఎస్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో అధికారంలో ఉన్న అన్ని అనుకూలతలను వాడుకొని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర వార్డు సభ్యులను తమ దారికి తెచ్చుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. దీంతో కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టేందుకు వెనుకాడొద్దనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నది. అనేక మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ వార్డు సభ్యులు, ఇతర పార్టీ సభ్యులు బీఆర్ఎస్ స్థానిక నాయకత్వాల టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో సాధ్యమైనన్ని ఎక్కువగా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులను గమనించే మంత్రులు, కాంగ్రెస్ లో భుజబలం ఉన్న నాయకులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ శిబిరంలోకి వెళ్లిన వార్డు సభ్యులను అనేకచోట్ల పోలీసులను ఉసిగొల్పి తమదారికి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ దరికి చేరిన స్వతంత్రులు, ఇతర పార్టీ నేతలకు సంపూర్ణ సహకారం అందిద్దామని, భవిష్యత్తులో వారికి మంచి అవకాశాలు ఇచ్చే విషయంలో తొలిప్రాధాన్యత ఇస్తామనే భరోసాను బీఆర్ఎస్ ఇచ్చినట్టు తెలిసింది.