సూర్యాపేట : ఓట్లు అడిగే దమ్ము ధైర్యం రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్(BRS) పార్టీకీ మాత్రమే ఉందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పరుగులు పెట్టడమే గులాబీ శ్రేణులకు ఆ స్థైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం బీబీగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ గులాబీ శ్రేణుల త్యాగాలు, ఉద్యమ నేత కేసీఆర్ పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం గులాబీ సైన్యమేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు గులాబీ శ్రేణుల భరోసా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తుందని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నిధులు జమ కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.
2014 కు ముందు సాగిన పాలనలో ప్రభుత్వ నిధులు మధ్యదళారుల జేబుల్లోకి నిధులు చేరుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీడను చూస్తేనే కేంద్రానికి వణుకు పుడుతుందన్నారు. మోదీ పాలనలో దేశంలో దారిద్య్రం నానాటికి పెరిగి పోతుందన్నారు. తెలంగాణా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు.దీంతో కమల నాథులు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు.