హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తమకు ప్రాణహాని ఉన్నదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన భద్రతను తాను హామీ ఇస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. డీజీపీ అంజనీకుమార్కు ఇటీవల ఫోన్ చేసి, ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ సమీక్షించిన విషయం విదితమే. ఐపీఎస్ అధికారితో విచారణ చేపట్టి, తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన డీజీపీ మేడ్చల్ డీసీపీ గోనె సందీప్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. డీసీపీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు వై ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై నేడో, రేపో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది.
వై+ క్యాటగిరీతో పహారా
గతంలోనూ ఇతరుల నుంచి ఈటల రాజేందర్కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం యోచించినట్టు తెలుస్తున్నది. శాంతిభద్రతల విషయంలో రాజీపడని రాష్ట్రప్రభుత్వం ఈటల రాజేందర్కు వై ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించనున్నది. ఈ క్యాటగిరీ కింద 11 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వారిలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (పీఎస్వో)లు ఉంటారు. ఒక ఎసార్ట్ వాహనం, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉండొచ్చు. ఇంటికి భద్రతగా అదనంగా ఒక గార్డును సైతం పహారా కోసం ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఈటలకు కల్పించే భద్రతా సిబ్బందిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కూడా ఉండనున్నట్టు సమాచారం. వీరి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. అయితే, రాష్ట్రప్రభుత్వం కల్పించే అదనపు భద్రతను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వీకరిస్తారా? లేక కేంద్ర భద్రత వైపే మొగ్గుచూపుతారా? అనేది తెలియాల్సి ఉన్నది.