2010 నుంచి నావికాదళం రాష్ట్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు.
-ఈ నెల 24న సీఎం రేవంత్రెడ్డి
వికారాబాద్లోని దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. మా చేతిలో నుంచి ముందుకు వెళ్లలేదు. మొత్తం ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తే మేం ఆఖరి ఫైల్ను మాత్రమే అందించాం. మాకేం సంబంధం లేదు.
-కొండా సురేఖ, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది, భూములు కేటాయించిందంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. వాళ్లు చేసిన కేటాయింపులు తుదిదశలో ఉంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నౌకాదళ అధికారులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర మంత్రి స్వయంగా ఇలా మాట్లాడటంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ప్రతిపాదనలు, అనుమతుల ప్రక్రియ మొత్తం జరిగిందే కాంగ్రెస్ హయాంలో అని దామగుండం పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఆధారాలతో సహా చెప్తున్నారు. 2010లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అనుమతుల ప్రక్రియ మొత్తం జరిగిందని తెలిపారు. ఒకవైపు ఇక్కడ రాడార్ కేంద్రం రావడం తమ గొప్పేనని చెప్తూ.. అడవుల బదిలీ జరిగింది బీఆర్ఎస్ సమయంలో అని, మాజీ మంత్రి కేటీఆర్ పరిగికి వెళ్లి దామగుండం పరిరక్షణ వేదిక వారితో మాట్లాడటం సరికాదని మంత్రి కొండా సురేఖ అనడం గమనార్హం. గత ప్రభుత్వం చేసిన ప్రతి నిర్ణయంపై లోతుగా సమీక్షలు చేస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, దామగుండం అటవీ భూముల కేటాయింపుపై ఎందుకు సమీక్ష చేయలేదని దామగుండం వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే సీఎం రేవంత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి జనవరి 10వ తేదీన చకచకా నౌకాదళ అధికారులను పిలిపించుకొని దామగుండంపై ప్రకటన చేశారు. 24వ తేదీన అధికారికంగా భూమార్పిడి పత్రాలను, రాడార్ కేంద్ర నిర్మాణ అనుమతుల పత్రాలను కూడా అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అత్యంత వేగంగా అమలు చేసిన ఏకైక పని దామగుండం రాడార్ కేంద్రమే కావడం గమనార్హం.
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నది. ఆయన జిల్లాలోనే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుపై సీఎం అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించలేదు. ఎలాంటి సమీక్షలు లేకుండా హడావిడిగా అనుమతులు ఇచ్చేశారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పదేండ్లు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పక్కకు పెట్టింది అన్నదానిపై కనీసం అధికారులతో మాట్లాడి, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించలేదు. న్యాయస్థానంలో కేసు ఉన్నపుడు, దాని పూర్వాపరాల గురించి సీఎం, సంబంధిత మంత్రి కనీసం అడిగి తెలుసుకోలేదు. పాత ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కనీసం ఆలోచించకుండా పక్కకు పెట్టిన రేవంత్ సర్కారు.. దామగుండం విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. పైగా 2014 నుంచి 2018 వరకు పరిగి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తిరిగి ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే కావడం, ఆగమేఘాలపై ఆయన నేవీ అధికారులను సీఎం వద్దకు తీసుకొచ్చి కలిపించడం, ఆ వెంటనే జనవరి 24న సీఎం నిర్ణయం తీసుకోవడం చకచక జరిగిపోవడం వెనుక మతలబేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
రాడార్ కేంద్రం ఏర్పాటుపై స్థానికుల్లో తలెత్తుతున్న అనుమానాలను తీర్చే ప్రయత్నమే ప్రభుత్వం చేయలేదు. కనీస ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే భూములు అప్పగించింది. పదేండ్ల క్రితం పరిగి ఎమ్మెల్యేగా రామ్మోహన్రెడ్డి ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లో ప్రజాభిప్రాయం, గ్రామ తీర్మానాల పేరుతో ఒక ప్రహసనం చేశారు. తూతూ మంత్రంగా అక్కడి సర్పంచులు, వార్డు సభ్యులతో సంతకాలు తీసుకున్నారు. సంతకాలు పెట్టేటప్పుడు వారికి అక్కడ ఏం వస్తుంది? ఏముంటుందన్నదానిపై స్పష్టత లేదు. పదేండ్ల తర్వాత అయినా మరోసారి గ్రామసభలు పెడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వికారాబాద్- దామగుండంలో అడవి లేదని మంత్రి చెప్పడంపై స్థానికులు మండిపడుతున్నారు. రాడార్ సెంటర్ కోసం 12 లక్షల వృక్షాలను తొలగించాల్సి వస్తుందని సాక్షాత్తు రాష్ట్ర పీసీసీఎఫ్ తెలిపారు. మంత్రి మాత్రం చెట్లు లేనిచోట రాడార్ సెంటర్ పెడుతున్నారని చెప్పడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలాగే, కాంపా నిధులను నేవీ అధికారులు జమ చేశారని చెప్తున్నారు. డబ్బులు జమ చేస్తే సరిపోదు.. ప్రత్యామ్నాయ అడవులను వాళ్లు పెంచాల్సి ఉంటుంది. అలా ఎప్పుడు, ఎక్కడ పెంచారన్నదానిపై స్పష్టత లేదు. రాడార్ను గడ్డి మైదానాల్లో మాత్రమే పెడుతున్నానమని, చెట్ల తొలగింపు లేదని పరిగి ఎమ్మెల్యే మీడియాతో చెప్పారు. ఇదే ఎమ్మెల్యే ఇటీవల పూడూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని అసలు అక్కడ రాడార్ కేంద్ర ఏర్పాటు పాపం బీఆర్ఎస్ సర్కారుదేనని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే కూడా పూటకో మాట మారుస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దామగుండంలో రాడార్ కేంద్రం ఏర్పాటుపై మొదటి నుంచీ స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రాడార్ కేంద్రం వద్దని అనేక విజ్ఞాపనలు రావడం, స్థానికులు న్యాయస్థానాలకు కూడా వెళ్లడంతో కేసీఆర్ ప్రభుత్వం రాడార్ కేంద్ర ఏర్పాటు అంశంపై ముందుకు వెళ్లలేదు.
file no 8-46\2011 FC తేదీ 15.01.2014 ద్వారా నౌకాదళ విభాగం పంపిన లేఖను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 1,174 హెక్టార్ల భూమిని నౌకాదళ అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. అప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే.
Rc No 42436\2011\F1- తేదీ 21.03.2011న రాష్ట్ర పీసీసీఎఫ్ కేంద్ర పర్యావరణ శాఖకు నౌకాదళ విభాగం పంపిన ప్రతిపాదనలపై లేఖ రాయడం, రాష్టం రాసిన లేఖను అదే ఏడాది ఏప్రిల్ 15వ తేదీన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం పంపడం జరిగింది.
LR.NO K\0167\VLF\AP\KARAN- తేదీ 07.09.2010న విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వికారాబాద్ అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.