న్యూఢిల్లీ: స్కూటీపై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త ఆగ్రహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యపై కాల్పులు జరిపాడు. ఆమె పుట్టిన రోజు నాడే హత్య చేశాడు. (Police Constable Shoots Wife) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మనీష్ భాటి ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్. తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్లో అతడ్ని నియమించారు. 26 ఏళ్ల భార్య ప్రియాంక టీచర్గా పని చేస్తున్నది.
కాగా, సోమవారం తెల్లవారుజామున కానిస్టేబుల్ మనీష్ భాటి తన భార్య ప్రియాంకతో కలిసి స్కూటీపై ప్రయాణించాడు. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఈ దంపతులు స్కూటీపై వెళ్తుండగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనీష్ రోడ్డు పక్కన స్కూటీ ఆపాడు. ఆ తర్వాత వారిద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహించిన మనీష్ తన వద్ద ఉన్న పిస్టల్తో భార్య ప్రియాంకపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత స్కూటీపై అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు రోడ్డుపై రక్తం మడుగులో పడి ఉన్న ప్రియాంకను కొందరు వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య ప్రియాంక పుట్టిన రోజు నాడే భర్తైన పోలీస్ కానిస్టేబుల్ కాల్చి చంపాడని పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మనీష్ భాటిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.