ఆదివాసీల ఆదిదైవం నాగోబా. సమైక్య పాలనలో అడవి బిడ్డల హక్కులను మాత్రమే కాదు, వారి దేవుడినీ పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది మంది నమ్ముకున్న దేవుడిని నిర్లక్ష్యం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామంలోని ఆనాటి నాగోబా ఆలయ చిత్రమిది. కోనంతా విస్తరించిన దేవుడికి పది అడుగుల చోటు దక్కడమే మహాభాగ్యమైంది. మొక్కులు ఈడేర్చే దైవం పరిస్థితే ఇలా ఉంటే… అడవి తప్ప అన్యం ఎరుగని గిరి బిడ్డల గోడు విన్నదెవరు?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అడవి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. వన సీమలో ఘనమైన కోవెలను నిర్మింపజేశారు. నాగోబా దేవాలయం కోసం బీఆర్ఎస్ సర్కారు రూ.6 కోట్లు మంజూరు చేసింది. మెస్రం వంశీయులు రూ.4.67 కోట్లు వెచ్చించారు. కఠినమైన శిలతో నాగోబా కొలువును అందంగా తీర్చిదిద్దారు. 2018లో చేపట్టిన నిర్మాణం 2022 డిసెంబర్ నాటికి పూర్తయ్యింది. నగిషీలు చెక్కిన స్తంభాలు, ముచ్చటైన గోపురం, అపురూప శిల్పాలు ఆదివాసీల వైభవాన్ని సగర్వంగా నిలబెట్టాయి.