బయ్యారం, జూలై 13: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిరిజన రైతులకు 1,116 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసింది. గ్రామంలోని పోడు రైతులకు ఏటా రైతుబంధు సాయం రూ.కోటి 11.60 లక్షలు, 18 నుంచి 59 ఏండ్లలోపు ఉన్న సుమారు 150 మందికి రైతు బీమా పథకాన్ని వర్తింపజేసింది. అంతేకాదు.. పోడు భూములకు విద్యుత్తు సౌకర్యం కూడా కల్పించాలని సర్కారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోడు రైతులందరికీ ఉచిత విద్యత్తు కూడా అందనున్నది.
గ్రామంలో మొత్తం 193 కుటుంబాలు ఉండగా.. సుమారు 770 మంది జనాభా నివసిస్తున్నది. ఇందులో 8 కుటుంబాలు గిరిజనేతరులు కాగా.. 185 కుటుంబాల వారు గిరిజనులే. వీరు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తాతలు, తండ్రుల నుంచి ఊరు శివారులోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయినా.. గ్రామంలో ఏ ఒక్క రైతు భూమికి ఇంత వరకు హక్కు పత్రాలు లేవు. ఏటా వ్యవసాయ సీజన్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో.. పోడు రైతుల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి పోడు పట్టాలు అందించాలని సంకల్పించి.. ఊరిలోని ప్రతి ఇంటికీ పోడు పట్టాలు అందించింది. కస్తూరినగర్ వాసులు ఈ ఏడాది సంబురంగా సాగు పనులు చేసుకుంటున్నారు. అటవీ శాఖ వేధింపులు ఉండవని సంతోషపడుతున్నారు.
పోడు పట్టాల పంపిణీతో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతుల ఇబ్బంది తీరింది. అనేక ఏండ్లుగా పోడు పట్టాల కోసం గ్రామస్థులంతా ఆశగా ఎదురు చూసేవారు. సీఎం కేసీఆర్ కృషితో ఊరిలోని ప్రతి ఇంటికీ పోడు పట్టా వచ్చింది. ప్రభుత్వం చేసిన మేలును గిరిజన రైతులు మర్చిపోరు. పోడు పట్టాలు ఇచ్చిన సర్కారును మళ్లీ గెలిపించుకుంటాం.
-బానోత్ కృష్ణకుమారి, సర్పంచ్, కస్తూరినగర్
పోడు పట్టాల పంపిణీ కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. పోడు పట్టాల కోసం దశాబ్దాల కాలంగా ఎదురుచూసిన గిరిజనుల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. పోడు సమస్య పరిష్కరిస్తామని మాట ఇచ్చి.. నిలబెట్టుకున్నారు. అటవీ శాఖతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోడు భూములకు పట్టాలు అందించి గిరిజన రైతుల కండ్లల్లో ఆనందాన్ని చూశారు.
-బానోత్ మురళీకృష్ణ, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, బయ్యారం
50 ఏండ్ల సంది వ్యవసాయం చేసుకుంటున్న. పోడు భూములను గుంజుకుంటామని ఫారెస్టోళ్లు వచ్చి లొల్లి పెడితే అరిగోస పడ్డాం. ఏటా సాగు సమయంలో వచ్చి పంటలు నాశనం చేసేటోళ్లు. రెక్కలు ముక్కలు చేసి, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన పైసలు వృథా అయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండవు. మా భూములపై మాకు హక్కులు వచ్చాయి. సర్కారు దయతో సంబురంగా సాగు చేసుకుంటాం.
-ధరారవత్ పిట్టి, రైతు, కస్తూరినగర్