Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో గడిచిన ఐదేండ్లలో మొత్తంగా రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు.
నియోజకవర్గంలో కొడంగల్, కోస్గి రెండు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీల తొలి దశ అభివృద్ధిలో భాగంగా కొడంగల్కు రూ.15 కోట్లు, కోస్గికి రూ.15 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, శ్మశానవాటికలు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. మలి దశ అభివృద్ధిలో భాగంగా రెండు మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు మంజూరు కావడంతో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నిధులకు తోడు మరో రూ.30 కోట్ల్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు మరింత ఊపందుకున్నాయి.
ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రూ.19 కోట్ల నిధులతో కొడంగల్, కోస్గి, మద్దూర్ మండలాల్లో అధునాతన దవాఖాన భవనాలు రూపుదిద్దుకొన్నాయి. కొడంగల్ సివిల్ దవాఖానను రూ.5.50 కోట్లతో అన్ని హంగులతో 50 పడకల భవనంగా నిర్మించారు. రూ.కోటి నిధులతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రూ. కోటి నిధులను కేటాయించడంతో కొత్త మార్చురీ భవనం, ఆసుపత్రి చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు.
మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని 220 గ్రామాల్లో ప్రతిరోజు కోటీ 90 లక్షల లీటర్ల తాగునీటి సరఫరా కొనసాగుతున్నది. మిషన్ భగీరథ ఏర్పాటుకు రూ.167 కోట్ల అంచనాతో గ్రిడ్ పనులు చేపట్టారు. గ్రామాల్లో ట్యాంకులు, పైప్లైన్లు, ఇంటింటికీ నీటి సరఫరా కోసం నల్లాల ఏర్పాటు వంటి పనుల నిర్వహణకు రూ.17 కోట్లు ఖర్చు చేశారు. కొడంగల్ పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రంలో ప్రతిరోజూ 23 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తున్నారు.
దాదాపు రూ.400 కోట్ల నిధులతో గ్రామగ్రామానికి లింక్ రోడ్లు పూర్తి కావడంతో ప్రజలు సాఫీగా ప్రయాణాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి పల్లెలు స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్నాయి.
నియోజకవర్గంలోని మద్దూర్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో రోడ్డు వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్కు రూ.13 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ మండలం పోచమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మైసమ్మతండాకు వెళ్లే దారిలో ఉన్న వాగుతో పోచమ్మ, మైసమ్మతండాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడేవి. ఏండ్ల నుంచి రెండు తండాల వాసులు అష్టకష్టాలు పడుతూ కాలాన్ని వెళ్లదీశారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రూ.50 లక్షలు మంజూరు చేయించడంతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ప్రస్తుతం పనులు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
మిషన్ కాకతీయ కింద కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలో రూ.39 కోట్లతో 140 చెరువులు, కుంటల్లో పూడిక పనులు చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో 56,425 ఎకరాలు సాగవుతున్నది. కొడంగల్ పెద్ద చెరువు సుందరీకరణకు రూ. కోటీ 60 లక్షలు మంజూరయ్యాయి. బొంరాస్పేట, తుంకిమెట్ల, మహంతిపూర్ గ్రామాల్లో రూ.60 కోట్లతో 17 చెక్ డ్యాంల నిర్మించారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల కింద నియోజకవర్గ పరిధిలో 1 లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలువ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ పట్టణ పరిధిలోని బండల ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రూ.4 కోట్ల 57 లక్షలతో డిగ్రీ కళాశాల నూతన భవనం, రూ.2 కోట్లతో కస్తూర్బా గాంధీ కళాశాల భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ ప్రాంతంలో రూ.4 కోట్ల 20 లక్షలతో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను నిర్మించారు.
నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసింది. కొడంగల్లో శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి, దౌల్తాబాద్లో శ్రీ వేంకటేశ్వరస్వామి, మద్దూర్లోని బావోజీ, బొంరాస్పేట, కోస్గిలో కూడా పలు ఆలయాల అభివృద్ధిపనులు జరుగుతున్నాయి.